● నిషేధిత పొగాకు ఉత్పత్తులపై దాడులు
● నిందితుడి అరెస్ట్
మదనపల్లె టౌన్ : నిషేధిత గుట్కా, కూల్ లిప్స్, ఖైనీ అక్రమ వ్యాపారానికి ఓ ఘనుడు మదనపల్లెను అడ్డాగా మార్చేశాడు. ఏకంగా ట్రేడర్స్ పేరుతో బెంగళూరు బస్టాండు వద్ద గోడౌన్లు నెలకొల్పి యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తూ.. యువతను పెడదోవ పట్టిస్తూ మత్తుకు బానిసలను చేస్తున్న నబీఖాన్ అలియాస్ ఇమ్రాన్ఖాన్ ఆట కట్టించారు వన్ టౌన్ పోలీసులు. తాను అడ్డాగా మార్చుకున్న అప్పారావుతోటలో పోలీసులు శనివారం మెరుపుదాడులు చేపట్టి.. 60 బస్తాల్లో ఉన్న రూ.32 లక్షల విలువైన గుట్కా, కూల్లిప్స్, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ట్రేడర్స్ యజమాని నబీఖాన్ను అరెస్ట్ చేశారు. దీనిపై సీఐ రాజారెడ్డి ఆదివారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ యం.వెంకటాద్రి పర్యవేక్షణలో వన్టౌన్ సీఐ కె.రాజారెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, రహీముల్లా వారి బృందం శనివారం అప్పారావుతోటలోని ఇమ్రాన్ ట్రేడర్స్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా 60 బస్తాల్లో నిల్వ ఉంచిన రూ.32,11,384 లక్షల విలువైన 26,760 కూల్లిప్స్, గుట్కా, చైనీ, ఖైనీ ప్యాకెట్లను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిన స్పష్టమైన పిక్టోరియల్ హెల్త్ వార్నింగ్ లేకుండా వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించి, వెంటనే స్థానిక ఈశ్వరమ్మ కాలనీ, గింజల వీధికి చెందిన నిందితుడు కాల్వగడ్డ నబీఖాన్ అలియాస్ ఇమ్రాన్ఖాన్(48)ను పట్టుకున్నామని సీఐ తెలిపారు. విచారణలో ఇతను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద ఉన్న దుకాణాలకు ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తూ యువతకు విక్రయిస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. నిందితుడిపై సిగరెట్స్ అండ్ అధర్ టొభాకోప్రొడక్ట్స్ యాక్ట్, 2003లోని సెక్షన్ 7, 8 రెడ్ విత్ 20తో పాటు బీయన్ఎస్ సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. మదనపల్లెలో యువతను, పిల్లలను మత్తుకు బానిసలను చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ పొగాకు, కూల్ లిప్స్ ఉత్పత్తుల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100/112కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడులు ఇంతటితో ఆగవని చెప్పారు. పట్టణ, రూరల్లో జరిగే విక్రయాలను అడ్డుకుని అమ్మేవారిని పట్టుకుని జైలుకు పంపుతామని తెలిపారు.


