మదనపల్లె టౌన్ : బహిర్భూమికి వెళ్లిన వృద్ధుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. వలసపల్లి గ్రామం మొలకల దిన్నెకు చెందిన ఉప్పుతోళ్ల వెంకటరమణ(68) మూడు రోజుల క్రితం బహిర్భూమికి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలో శనివారం ఉదయం చెరువు నీటిలో వెంకటరమణ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ కళా వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య పదేళ్ల క్రితమే చనిపోగా, ఒక కుమారుడు పట్టణంలో ఉంటున్నాడు. పెన్షన్తో జీవనం సాగిస్తున్న వెంకటరమణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మదనపల్లె టౌన్ : పెద్దమండెం మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దవరానికి చెందిన రవికుమార్ కుమారుడు కె.మంజునాథ్ (40) సొంత పనిపై బైకులో గుర్రంకొండకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గంమధ్యలోని తురకపల్లి సమీపంలోని ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న మంజునాథ్ను స్థానికుల సాయంతో హుటాహుటిన 108 అంబులెన్స్లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని చూసిన భార్య గుండెలవిసేలా విలపించింది. కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రి వద్ద మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


