కురబలకోట: పరిశోధనలో నవ్యత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వీసీ యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం ఈనెల 5న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల పరీక్షలో 89 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా యూనివర్సిటీ ముందుకు సాగుతోందన్నారు.
పీఎం శ్రీ పాఠశాలల అమలు సక్రమంగా నిర్వహించాలి
రామసముద్రం: పీఎం శ్రీ పాఠశాలల అమలు సక్రమంగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి టి. అబ్దుల్ నాదిర్షా వలి తెలిపారు. శుక్రవారం ఆయన రామసముద్రం మండలం చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ మౌలిక వసతులు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా నిర్వహిస్తున్న బోధనను పరిశీలించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సాంకేతికత ఆధారిత బోధనతో పాటు ప్రయోగాత్మక అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె. రమేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
కడప కోటిరెడ్డిసర్కిల్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ‘జాతీయ లోక్ అదాలత్’ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమమూర్తి సి.యామిని తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 29 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కడపలో 8, ప్రొద్దుటూరు 5, రాజంపేట 3, రాయచోటి 3, బద్వేలు 2, సిద్ధవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు, రైల్వే కోడూరులో ఒక్కో బెంచీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ లో తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందవచ్చని ఆమె సూచించారు.
దశలవారీగా బిల్లుల వసూళ్ల కేంద్రాల మూసివేత
చిత్తూరు కార్పొరేషన్: డిస్కం పరిధిలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలను దశలవారీగా మూసివేయనున్నట్లు ట్రాన్స్కో సీఎండీ శివశంకర్ శుక్రవారం ప్రకటించారు. డిజిటల్ చెల్లింపుల పెంపు లక్ష్యంగా ఈ చర్యలకు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపులు మరింత పెరుగుతుందన్నారు. బిల్లులు కట్టడానికి క్యూలో వేచి చూసే పనిలేకుండా ఇక డిజిటల్ చెల్లింపులు చేస్తారన్నారు. డిస్కం పరిధిలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మొత్తం 61.32 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నరన్నారు. బిల్లుల చెల్లింపుల ద్వారా ప్రతి నెల దాదాపు సంస్థకు రూ.520 కోట్ల వస్తోందన్నారు. ప్రస్తుతం 49.50 శాతం ఆన్లైన్ చెల్లింపులు జరుగుతోందన్నారు. వీటిని దశలవారీగా 100 శాతం పెంచడమే లక్ష్యమని తెలిపారు.


