మదనపల్లె టౌన్ : ఆస్తి కోసం కన్నేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. వృద్ధుడిని పథకం ప్రకారం విష ప్రయోగంతో హతమార్చాడనే ఆరోపణలు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. మదనపల్లె ఘటనపై మృతుడి కుమార్తె శంకరమ్మ తెలిపిన వివరాలు.. పట్టణంలోని పోస్టల్ అండ్ టెలికం కాలనీలో నివాసం ఉంటున్న పూల వెంకటప్ప(68), లక్ష్మమ్మ దంపతులు నివసిస్తూ.. కుమారుడు ఆనంద్, కుమార్తె శంకరమ్మను పోషించు కునేవారు. ఇటీవల వెంకట రమణ భార్య లక్ష్మమ్మ, కుమారుడు ఆనంద్ ఒకరి తరవాత ఒకరు మృతి చెందడంతో వెంకటరమణ ఒంటరి అయ్యాడు. కుమార్తె శంకరమ్మ కూడా కురువంకలోనే కాపురం ఉంటోంది. అయితే ఆమె తండ్రి బాగోగులు చూడలేదని తెలిసింది. దీంతో ఆ వృద్ధుడికి పక్కింటికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రవి నాయక్ అన్నం నీళ్లు పెట్టిస్తూ సపర్యలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుమారు రూ.50 లక్షల విలువ చేసే వృద్ధుడు వెంకటరమణ ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా తన పేరున రావినాయక్ రాయించుకున్నట్లు మృతుడి కూతురు శంకరమ్మ ఆరోపణ చేస్తోంది. తమ తండ్రిని పథకం ప్రకారం స్లో పాయిజన్ ఇచ్చి హత మార్చారని ఆరోపించింది.
తాలూకా పోలీసులకు ఫిర్యాదు
దీనిపై మృతుడి కుమార్తె శంకరమ్మ తాలూకా సీఐ కళా వెంకట రమణకు ఫిర్యాదు చేశారు. రవి నాయక్నే తన తండ్రిని చంపేశాడని ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఐ కళా వెంకటరమణ ఇరు వర్గాలను విచారణ చేశారు. వెంకటప్ప మృతిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
రవి నాయక్ వివరణ
ఈ ఆరోపణలపై రవి నాయక్ మాట్లాడుతూ.. తాను వెంకటప్పను చంపలేదని, ఆయనకు అన్నం పెట్టి సపర్యలు చేసి సేవ చేసినందుకే ఇష్ట పూర్వకంగా వెంకటరమణే తన ఇంటిని తన పేరున రాసిచ్చారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం బయట పడనుంది. ఘటనతో కాలనీలో తీవ్ర కలకలం నెలకొంది.
ఆస్తి కోసం వృద్ధుడికి విషం పెట్టి హత్య చేశారని ఆరోపణ
రూ.50 లక్షల ఇంటిని రాయించుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై అనుమానం
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి కుమార్తె


