పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లికి పడమటి వైపు ఉన్న వ్యవసాయ బీడు భూములు, పీటీఎం పరిసరాల్లోని బోడిగుట్ట వద్ద శుక్రవారం పులి సంచరించినట్లు తప్పుడు ప్రచారం జరిగింది. పులి సంచరించిన ఫొటోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పలువురు పశు కాపరులు, దినసరి కూలీలు భయభ్రాంతులకు లోనయ్యారు. మరి కొందరు ఇదంతా వట్టి పుకార్లు అంటూ కొట్టి పడేశారు. ఇదిలా ఉండగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించి వైరల్ చేసే ఫొటోల సంఖ్య సామాజిక మాధ్యమాల్లో రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. తద్వారా ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేక ప్రజలు తికమక పడుతున్నారు. ఏది ఏమైనా అటవీ శాఖ అధికారులు స్పందించి సదరు గ్రామ పరిసరాల్లోని బీడు భూములను క్షుణ్ణంగా పరిశీలించి.. పులి సంచరించిన ప్రదేశాల్లో అడుగు జాడల ఆనవాళ్లు ఉన్నాయా, లేవా అని సమగ్రంగా ఆరా తీసి ప్రజల్లో ఉన్న భయాందోళనలు, అనుమానాలను నివృత్తి చేయాలని ఈ ప్రాంత వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సామాజిక మాధ్యమాల ద్వారా పులి సంచార వార్త విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సమగ్రంగా ఆరా తీశారు. పులి సంచారంపై వస్తున్న వదంతులన్నీ వట్టి పుకార్లేనని, ఏఐ ద్వారా ఫొటో క్రియేట్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ పరిసర ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తూ అటవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రంలో విచారణ చేపడుతున్నారు.
పులి సంచారం అంటూ అసత్య ప్రచారం
పోలీసుల అదుపులో ముగ్గురు ఏఐ ఫొటో క్రియేటర్లు


