మదనపల్లి (కురబలకోట): ఏళ్లుగా వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న బురకాయలకోట–అంగళ్లు మీదుగా ఉన్న రహదారి మార్గం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. రెండేళ్ల క్రితం ఈ మార్గంలో బైపాస్ రోడ్డు వేశారు. అయితే ఊరిలో ద్వారా వెళ్లు రహదారులు అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో రూ.10.86 కోట్ల వ్యయంతో ములకలచెరువు మండలం బురకాయల కోటతో పాటు అంగళ్లు మీదుగా విశ్వం బైపాస్ సర్కిల్ మార్గంలో ఉన్న బైపాస్ లింక్ రహదారిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు హైవే డీఈ మధుసూధన్ తెలిపారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. బురకాయలకోట, అంగళ్లు ఊరిలో ద్వారా వెళ్లే 8.07 కిలోమీటర్ల రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అంగళ్లు గోల్డన్వ్యాలీ దగ్గర నుంచి అంగళ్లు ఊరిలో మీదుగా విశ్వం సర్కిల్ వరకు ఉన్న 2.20 కిలోమీటర్ల రోడ్డును కూడా విస్తరించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా మురికినీటి కాలువలు, విద్యుత్ లైట్లు, ఇంటర్ లాకింగ్ సిమెంట్ బ్లాక్స్లతో కాలి బాటలు (పేవర్ బ్లాక్స్) ఏర్పాటు చేయనున్నారు. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. పాదచారులు సురక్షితంగా రాకపోకలకు అవకాశం కలుగుతుంది. అధికారులు గురు,శుక్రవారాల్లో అంగళ్లులో సర్వే నిర్వహించారు. ఆక్రమణలు గుర్తించారు. రోడ్డు హద్దు వరకు మార్కింగ్ వేశారు. ఆక్రమణలను తొలగించి అతి త్వరలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పనులు పూర్తయితే రద్దీగా ఉన్న బురకాయలకోట, అంగళ్లులో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారగలదు. ముఖ్యంగా అంగళ్లులో మిట్స్, విశ్వం, గోల్డన్వ్యాలీ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు ఇతర బాటసారులు, ప్రయాణికుల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉండగలదు. సర్వేలో కురబలకోట మండల సర్వేయర్ భువనేశ్వరి, అంగళ్లు సర్వేయర్ ఇందుమతి పాల్గొన్నారు.
రూ.10.86 కోట్లతో అభివృద్ధి పనులు


