సాక్షి, మదనపల్లె: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా తిరుపతిలో నిర్వహిస్తున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ కళాశాలలో 2026–27 ఏడాదికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అడ్మిషన్స్ ఇన్చార్జ్ శివరామకృష్ణ గురువారం తెలిపారు. ఈ కోర్సుల్లో చేరడానికి ఎలాంటి వయో పరిమితి లేదన్నారు. కోర్సులు పూర్తయిన తర్వాత రాష్ట్ర పర్యాటక శాఖ హోటళ్లు, ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9701343846, 9100558006, 9700440604 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
11 నుంచి రాష్ట్రస్థాయి
ఫుట్బాల్ పోటీలు
మదనపల్లె సిటీ: మదనపల్లెలో ఈనెల 11 నుంచి 13వతేదీ వరకు రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లకు వివరాలు వెల్లడించారు. మదనపల్లెలోని మిషన్కాంపౌండ్ మైదానం, గ్రీన్వ్యాలీ స్కూల్, వశిష్ట స్కూల్ మైదానాల్లో పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి జూనియర్ కేటగిరిలోని బాలురు ఇందులో పాల్గొంటారని తెలిపారు.సమావేశంలో ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రకళ, జాన్ కమలేష్, కోశాధికారి నరేష్బాబు, జాయింట్ సెక్రటరీ మహేంద్రనాయక్, మహేంద్ర, బాలాజీ, ఇర్షాద్,కోచ్ మౌలాలి పాల్గొన్నారు.
వీవీఎం పోస్టర్లు విడుదల
మదనపల్లె సిటీ: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో శాసీ్త్రయ దృక్పథాన్ని, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు ‘విద్యార్థి విజ్ఞాన మంథన్ (వీవీఎం) 2026–27’ జాతీయ స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. సైన్స్ ప్రతినిధులతో కలిసి ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్త భాగస్వామ్యంతో ‘విజ్ఞాన భారతి’ ఈ పరీక్షను నిర్వహిస్తోందన్నారు. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో బహుమతులు లభిస్తాయని పేర్కొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని, సాంకేతిక సమస్యలు రాకుండా విద్యార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. వివరాలకు www.vvm.org.in వెబ్సైట్ను చూడవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7702202288 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
బాధ్యతల స్వీకరణ
కడప సిటీ: సమాచార పౌర సంబంధాల శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా సహాయ సంచాలకులు (ఏడీ)గా ఎ.రమేష్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఒంగోలు డీపీఆర్వోగా విధులు నిర్వర్తించిన ఆయన, పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడీ రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. సిబ్బంది అంతా కలిసికట్టుగా, స్నేహపూర్వక వాతావరణంలో కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు.
ఉద్యానశాఖ అధికారిగా హరిప్రసాద్
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లా ఉద్యానశాఖ నూతన జిల్లా అధికారిగా ఎం.హరిప్రసాద్ గురువారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యానశాఖ ఏడీఏగా పనిచేసిన ఆయన, పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. కడప కలెక్టరేట్లోని జిల్లా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. అందరి సమన్వయంతో జిల్లాలో ఉద్యాన పంటల సాగు, ప్రగతికి ప్రత్యేక కృషి చేస్తానని వివరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని, మొక్కను బహూకరించి అభినందనలు తెలిపారు.


