కేవీపల్లె : మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీలో పంట పొలాలపై ఏనుగుల గుంపు వరుస దాడులు చేస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి జిల్లేళ్లమంద పంచాయతీ రాగులవారిపల్లె సమీపంలో పంట పొలాలపై దాడి చేసి బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన రైతులు రామకృష్ణారెడ్డి, నాగిరెడ్డికి చెందిన పొలాలపై దాడి చేశాయి. వ్యవసాయ బోరు, పైపులు ధ్వంసం చేశాయి. వరిపంటకు సిద్ధం చేసిన నారుమడిని పూర్తిగా తొక్కి పనికిరాకుండా చేశాయి. పగలు అటవీ ప్రాంతానికి వెళ్లడం... రాత్రి సమయంలో పంట పొలాలపై పడడం ఏనుగులకు షరా మామూలైంది. గత నెలలో పలువురు రైతులకు చెందిన మామిడి చెట్లు, కొబ్బరి, పనస చెట్లు ధ్వంసం చేశాయి. అనంతరం కొద్దిరోజులు సుండుపల్లె మండలంలో సంచరించాయి. వారం రోజులుగా తిరిగి కేవీపల్లె మండలంలోని వివిధ గ్రామాల్లో సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి. రాత్రి సమయంలో ఏ రోజు ఎవరి పంటలపై దాడి చేస్తాయోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులను శాశ్వతంగా అరికట్టడానికి అటవీప్రాంత సరిహద్దు గుండా ట్రెంచ్ తవ్వాలని రైతులు కోరుతున్నారు.


