మదనపల్లె టౌన్ : దళితనేత, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భారతీయ అంబేడ్కర్ సేన అధ్యక్షుడు శివప్రసాద్ తెలిపారు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందనడానికి ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు నిదర్శనమన్నారు. 2005లో జరిగిన ఓ ఘటనలో శ్రీచందును ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించడం తగదన్నారు. ఫిర్యాదుదారు మొహం కూడా చూడని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడని దళిత నాయకుడిపై తప్పుడు కేసు నమోదు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలోనే తిష్ట వేసిన తాలూకా సీఐ అవినీతి, సివిల్ సెటిల్మెంట్స్, అహంకారం, ఎస్సీ, ఎస్టీ బాధితులకు చేస్తున్న అన్యాయం, అవమానాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకే శ్రీచందును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బాస్ నాయకులు ముత్యాల మోహన్, సీపీఐ నాయకులు శ్రీనివాసులు, గిరిజన సమఖ్య రాష్ట్ర నేత కోనేటి దివాకర్, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


