తంబళ్లపల్లె : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఇంటిలో వస్తువులు పూర్తిగా కాలిపోయి రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిన సంఘటన మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కోసువారిపల్లె పంచాయతీ పాపనచెరువుపల్లెకు చెందిన భాగ్యమ్మ కూలీ పనులతో జీవనం సాగిస్తుంది. ఆమె కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు గమనించి ఈ విషయాన్ని భాగ్యమ్మకు తెలియజేశారు. ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకున్న సమయంలోనే మంటలు చెలరేగి ఇంటిలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ములకలచెరువు ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. అగ్నిమాపక వాహనం వచ్చే సరికి పూర్తిగా కాలిపోయింది. ఇంటిలో దాచుకున్న రెండు లక్షల నగదు, పది గ్రాముల బంగారు, బట్టలు, ధాన్యం, వంటపాత్రలు, ఫ్రిజ్ పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు భాగ్యమ్మ బోరున విలపించింది. సమాచారం అందుకున్న ఆర్ఐ ముద్దుకృష్ణ, వీఆర్ఓ రాజగోపాల్లు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకులు కోటిరెడ్డి, పార్టీ కన్వీనర్ చౌడేశ్వర్లు పరామర్శించి రూ.10 వేల నగదు ఆర్థిక సహాయం అందించారు.
రూ.5 లక్షల నష్టం


