చౌడేపల్లె : తమ పొలంలో నాటిన మామిడి చెట్లను నరికివేస్తున్న వ్యక్తిని అడ్డుకోబోయిన మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జరిగింది. బాధితురాలు రెడ్డెమ్మ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దిగువపల్లె రెవెన్యూ పరిధిలోని దేవిరెడ్డిచెర్వు సమీపంలో గల గాడిదవానిగుట్ట ప్రాంతం వద్ద గల సర్వే నెంబర్లు 469/2ఏ, 466/2, 183/19లలో 6.69 ఎకరాల భూమిని కాగతి పంచాయతీ మర్రిమాకులపల్లెకు చెందిన బాబుసాబ్ నుంచి గాజులవారిపల్లెకు చెందిన భాస్కర్, రెడ్డెమ్మలు పదేళ్ల క్రితం కొనుగోలు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేసుకొన్నారు. మార్కెట్లో ఆ భూమికి విలువ పెరగడంతో మళ్లీ మరికొందరికి విక్రయించడానికి బాబుసాహెబ్ అడ్డుతిరిగి తమ భూమిని వదిలేయాలని, దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. పొలంలో నాటిన మామిడి చెట్లను బుధవారం నరికివేస్తుండగా.. గమనించి అక్కడికి వెళ్లింది. బాబూ సాహెబ్ను ఇది నీకు తగదని ప్రశ్నించగా తనపై హత్యాయత్నానికి ప్రయత్నించగా ప్రతిఘటించి కేకలు వేయగా అతను వెంట తెచ్చుకొన్న బైక్ను సైతం అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం
● పోలీసులకు ఫిర్యాదు


