కడప అర్బన్ / ప్రొద్దుటూరు క్రైం : జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు ప్రాంతంలో నిర్వహిస్తున్న కళ్లాపి పౌడర్ (సాధారణంగా ‘పేడ నీళ్ల పౌడర్‘గా పిలువబడే) తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన దాడుల వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని శ్రీ సౌభాగ్య కుంకుమ ఇండస్ట్రీ గోడౌన్, కామధేను కుంకుమ ఇండస్ట్రీ, శ్రీ మహాలక్ష్మి కుంకుమ/పసుపు ఇండస్ట్రీ, చంద్రిక ట్రేడర్స్, శ్రీ దేవి–భూదేవి కళ్లాపి ఇండస్ట్రీ (ఎంఎస్ ట్రేడర్స్)లలో అధికారులు తనిఖీ నిర్వహించారన్నారు. ప్రొద్దుటూరు తహసీల్దార్ డి. ఉదయ భాస్కర్ రాజు, పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావు తదితరులు ఈ తనిఖీలలో పాల్గొన్నారన్నారు. కళ్లాపి పౌడర్ అనే ఈ విషపూరిత పదార్థం ఆత్మహత్యలు మరియు ప్రమాదవశాత్తు విషప్రయోగాలకు కారణమవుతోందన్నారు. ఈనెల 1వ తేదీన నుంచి 6వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లాలో కళ్లాపి పౌడర్ సేవించడం వల్ల మొత్తం 19 మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందారని... ఈ నేపథ్యంలో ఈనెల 7న ప్రొద్దుటూరు ప్రాంతంలోని కళ్లాపి పౌడర్ తయారీ యూనిట్లపై సంయుక్త తనిఖీలు నిర్వహించామన్నారు. దాడుల్లో వెయ్యి కిలోల ఆరమైన్ ఓ కెమికల్ బ్యాగులు, 3 వేల కిలోల కళ్లాపి పౌడర్ను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన కెమికల్, కళ్లాపి పౌడర్ శ్యాంపిళ్లను పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపించారు.


