పెళ్లి ఇంట విషాదం
● పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో వధువు తండ్రి మృతి
● 10 రోజుల్లో పెళ్లి ఉండగా ఘటన
ములకలచెరువు : కన్న కూతురి పెళ్లి కళ్లారా చూడాలని... ఘనంగా చేయాలని కలలు కన్న ఒక తండ్రి సంతోషంతో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన పి.ఖాసీంవలి కుమార్తె అఫ్రీన్కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఖాసీంవలి ఉదయం ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్లాడు. అక్కడ పెళ్లి పత్రికలు పంచి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ములకలచెరువు మీదుగా మద్దయ్యగారిపల్లెకు వెళ్తుండగా నాయనచెరువుపల్లి సత్రం మలుపు వద్ద ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తున్న బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లి నారాయణస్వామికి చెందిన ద్విచక్రవాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఖాసీంవలి తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. నారాయణస్వామి సైతం తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి అఫ్రీన్, అమ్మాజాన్ ఇద్దరు కుమార్తెలు, ఆసీఫ్ కుమారుడు, భార్య సంషాద్ ఉన్నారు. సంఘటన స్థలంలో వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పెద్దదిక్కు లేకుండా చేశావు.... మేము నీకేమి అన్యాయం చేశాం దేవుడా అంటూ రోదించారు.


