
నాటి సీఎం వైఎస్ జగన్ని అనకూడని మాటలు అన్నావు.. ఒక్కసారి విను..
అప్పట్లో నీ ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి?
వెయ్యి రూపాయలు ఏమయ్యాయో తెలీదంటూ ఆ రోజుల్లో ఎంతో ‘ఆవేదన’ పడ్డారు?
మీ తప్పుల్ని ఎత్తిచూపినా, నీ అబద్ధాలను ఎండగడుతున్నా తట్టుకోలేక అధికార అహంకారంతో బెదిరించడంమీకు అలవాటైంది
మంత్రి నారా లోకేశ్కు ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ ఘాటు కౌంటర్
సాక్షి, అమరావతి :తల్లికి వందనం పథకం అమలుతీరుపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీని ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఘాటుగా బదులిచ్చింది. మంత్రి సవాల్కు ప్రతి సవాల్ కూడా చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కౌంటర్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ స్పందన ఏమిటంటే..‘‘నారా లోకేశ్.. యూడైస్ నివేదిక 2023–24 ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మొత్తం 87,41,885 మంది. ఆ రిపోర్టును జతచేస్తున్నాం.
కానీ మీరు అంగన్వాడీ పిల్లలను కలిపారని అంటున్నారు. మీ వ్యాఖ్యలను ఈ నివేదిక సమర్థించడంలేదు. దీనికి సమాధానం ఏంటి? పైగా ఆనాటి విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవంటూ అవమానకరంగా, హేళనచేస్తూ మాట్లాడ్డం సంస్కార హీనం’’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాచారానికి సంబంధించిన పేపర్లు, వీడియో క్లిప్పింగ్స్లు జతచేసింది.
నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి?
‘‘మీ తప్పుల్ని ఎత్తిచూపినా, నీ అబద్ధాలను ఎండగడుతున్నా తట్టుకోలేక అధికార అహంకారంతో బెదిరించడం మీకు అలవాటైంది. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ పేరు చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బులు లాగేస్తున్నారని గతంలో మీరు చెప్పిన సిద్ధాంతమే లోకేశ్. అప్పుడు ఎన్నికల్లో నువ్వు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు మేం చెప్తుంటే అంత ఉలుకెందుకు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని అనకూడని మాటలు కూడా అన్నావు. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి? అప్పట్లో స్వయంగా నువ్వు ఏమన్నావో ఒక్కసారి విను’’.
ఆ రోజుల్లో మీ వేదన అంతా ఇంతా కాదు..
‘‘వైఎస్సార్సీపీ హయాంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గురించి మీరు, మీకు వత్తాసు పలుకుతూ నిరంతరం అబద్ధాలు వండివార్చే మీ పార్టీ కరపత్రం ఈనాడు రాసిన ఒక కథనాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పోస్టు ఇది. వెయ్యి రూపాయలు ఏమయ్యాయో తెలియదంటూ పాపం ఆ రోజుల్లో మీరు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. మరి దీనికి ఎవరిపై కేసులు పెట్టాలి? మీ పార్టీ సోషల్ మీడియాను నడిపిన మీపైనా? ఏనాడూ నిజం చెప్పని ఈనాడుపైనా? లేక ఇద్దరిపైనా? లేకపోతే ఆ పోస్టు చేసింది మా పార్టీ కాదని మళ్లీ అదే ఎల్లో మీడియాతో రాయిస్తావా? అంతటి ఘనుడివే నువ్వు’’.. అంటూ శుక్రవారం వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.