రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలి | YSRCP seeks immediate completion of Rayalaseema Lift Irrigation Project | Sakshi
Sakshi News home page

రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలి

Jun 16 2026 5:51 AM | Updated on Jun 16 2026 5:51 AM

YSRCP seeks immediate completion of Rayalaseema Lift Irrigation Project

సమావేశమైన రాయలసీమ లిఫ్ట్‌ సాధన కమిటీ నాయకులు

అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నారు  

త్వరలోనే గ్రేటర్‌ రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టుల సందర్శన 

తొలి విడతలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సందర్శన 

వైఎస్సార్‌సీపీ రాయలసీమ లిఫ్ట్‌ సాధన కమిటీ నాయకులు  

సాక్షి, అమరావతి: గ్రేటర్‌ రాయలసీమ ప్రజల నీటి అవసరాలు గుర్తించి ఇప్పటికైనా రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ రాయలసీమ నాయకులు డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాయలసీమ లిఫ్ట్‌ సాధన కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీ నర్‌ సాకే శైలజానాథ్, సభ్యులైన పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కందుల నాగార్జునరెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను శైలజానాథ్‌ మీడియాకు వెల్లడించారు.  

సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం 
‘‘రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు స్వార్థంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు ప్రశ్నార్థకం చేస్తున్నారు. సీఎం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు నిరి్మస్తూ కృష్ణా నీటిని తరలించుకుపోతున్నారు. మాయమాటలతో గ్రేటర్‌ రాయలసీమ ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల ద్వారా రోజూ 7 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కర్ణాటకలో అప్పర్‌ భద్ర, ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తయితే కనీసం 130 టీఎంసీల నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఈ పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాయలసీమ నీటి ఇబ్బందులకు పరిష్కారం చూపినట్టవుతుందని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.1000 కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలని గ్రేటర్‌ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వివరించాం. కానీ వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే అక్కసుతో రెండేళ్లుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టేశారు.

బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గాల్లో లెక్కలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పణంగా పెడుతున్నాడు. గ్రేటర్‌ రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలనే డిమాండ్‌తో ముందుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో అనంతపురం, నెల్లూరులోని ప్రాజెక్టులను సందర్శిస్తాం’’ అని శైలజానాథ్‌ తెలిపారు.  

రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం  
‘‘రాయలసీమ రైతులకు చంద్రబాబు నుంచి భరోసా లభించడం లేదు. హార్టికల్చర్‌ హబ్‌గా ఉన్న ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. నీళ్లు లేక చీనీ తోటలు ఎండిపోతున్నాయి. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభలో వైఎస్‌ జగన్‌ని తిట్టడం తప్పితే, రెండేళ్లలో ఏం సాధించారో చెప్పుకోలేకపోయారు.

దుబారా ఖర్చులను తగ్గించాలని పిలుపునిస్తూ ఆర్భాటపు సభలతో, జగన్‌ని దూషించడానికి పదుల కోట్లు ఖర్చు చేయడం అవసరమా?. రెండేళ్ల తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి పంగనామాలు పెట్టేశారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో జరిగిన నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రుజువైంది. కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పందించలేదు. కనీసం ఒక్క కొత్త పింఛన్‌ ఇచి్చన పాపాన పోలేదు. ఓటేసిన ప్రజల నమ్మకానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు’ అని శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement