
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 7వ తేదీన ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించిన అప్డేట్స్ను అందించాయి.
ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు(YS Jagan Bhimavaram Tour). మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అలాగే.. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ అనకాపల్లిలో పర్యటించనున్నారు(jagan Anakapalle Tour).
నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటు వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.