రైల్వేకోడూరులో సాధికార హోరు | YSRCP Bus Trip in Railway Kodur | Sakshi
Sakshi News home page

రైల్వేకోడూరులో సాధికార హోరు

Jan 4 2024 5:22 AM | Updated on Jan 4 2024 8:40 AM

YSRCP Bus Trip in Railway Kodur - Sakshi

సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో బడుగు, బలహీన వర్గాల సాధికారత హోరెత్తింది. బుధవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమను అభివృద్ధి దిశగా నడిపిస్తున్న తీరును వివరిస్తూ ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. వారికి ప్రతి వీధిలో స్థానిక ప్రజలు హారతులతో స్వాగతం పలికారు.

రాజ్‌ రెసిడెన్సీ నుంచి టోల్‌గేట్‌ వరకు కిక్కిరిసిన జనం మధ్య సాగిన ఈ యాత్రలో మహిళలు కదం తొక్కారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా యాత్రలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రాన్ని తలపించింది. ఈ సభలో పలువురు నేతలు ప్రసంగిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న పథకాలు, ఈ వర్గాలు సమాజంలో తలెత్తుకొనేలా వారికి అందిస్తున్న చేయూతను వివరించారు. సభ ఆద్యంతం ప్రజలు జై జగన్, జగనే మళ్లీ కావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు.

పేదవాడి అకౌంటులో సంక్షేమం : ఎంపీ నందిగం సురేష్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమం ఎప్పటికీ మరు వలేనిదని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. అవినీతి లేని పరిపాలనను అందిస్తున్న సీఎం జగన్‌ ప్రతి పేదవాడికి అకౌంటులో ఠంచనుగా పథకాల నగదు జమ చేస్తున్నారన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని, చివరకు కుర్చీ, సైకిల్‌ పార్టీ గుర్తు కూడా ఆయనవి కావని అన్నారు.

14 ఏళ్ల బాబు హయాంలో వచ్చింది వెన్నుపోటు పథకం మాత్రమేనని, ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలేవీ లేవని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రజలకు సంక్షేమం అందుతోందని చెప్పారు. సీఎం జగన్‌ అందిస్తున్న పథకాలు, చేయూతతో బడుగు, బలహీన వర్గాల జీవన విధానం ఎంతో మెరుగు పడిందని, ఇప్పుడు వారు సమాజంలో తలెత్తుకొని ధీమాతో జీవిస్తున్నారని వివరించారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో రాజకీయ హక్కులతోపాటు ఉన్నత పదవులు ఇచ్చారని అన్నారు. టీడీపీ నాయకులు డబ్బుతో ఓటు కొనాలని చూస్తున్నారని, బాబును నమ్ముకుని ఓటు వేస్తే ఒక్క దినం గడవదని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన సీఎం జగన్‌కు ఓటు వేస్తే ఒక తరం గడుస్తుందన్నారు.

175 సీట్లు గెలిపిద్దాం : అలీ
సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక సాధికారతను చేతల్లో చేసి చూపించారని ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ చెప్పారు. 2019లో సీఎం జగన్‌కు 151 సీట్లిచ్చామని,  ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 175 సీట్లను సీఎం జగన్‌కు  కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

బడుగులకు న్యాయం : ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌
సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయాన్ని చేతల్లో చేసి చూపించారని ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఈ వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, ఆయన ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకు ఎమ్మెల్యేలు, మంత్రి పదవులిచ్చారని, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్‌లుగా అధికారాన్ని అప్పజెప్పారని తెలిపారు.

రైల్వే కోడూరును అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్‌ : ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రైల్వేకోడూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.1,600 కోట్లు వెచ్చించామన్నారు. రూ. 11 కోట్లతో రైల్వేకోడూరు అండర్‌ బ్రిడ్జి, 50 కోట్లతో కోడూరు – చిట్వేలి డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు.

పెనగ లూరు చిట్వేలి మండలాలకు 235 కోట్లతో సాగు, తాగు నీరందిస్తున్నామని,  రూ.150 కోట్లతో ఎన్నో భవనాలు, సీసీరోడ్లు, వాటర్‌ ట్యాంకులు, రూ. 50 కోట్లతో గుంజన నది ప్రొటెక్షన్‌వాల్‌ నిర్మించడానికి కృషిచేశామన్నారు. రాబోయే కాలంలో 10 వేల ఉద్యోగాలతో జాబ్‌మేళా నిర్వహించి నిరుద్యోగుల, యువకుల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు రామసుబ్బారెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement