సాక్షి, తిరుపతి: తిరుమలలో టీటీడీ, విజిలెన్స్ నిర్లక్ష్యంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో నిర్లక్ష్యానికి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. స్వామి వారి చిత్రపటాలు చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. పవనానంద స్వామి.. మీ సనాతనం ఎలా ఉందో చూడండి అని మండిపడ్డారు. ఇవన్నీ చూసి పాలకులు సిగ్గుపడాలన్నారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుమలలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో టీటీడీని పరిరక్షిస్తున్నామంటూ గొప్పలు చెబుతూనే తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి పాలనలో అలిపిరి దగ్గర నుంచి కిలోమీటర్ పరిధిలో వెంకటేశ్వర స్వామి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన చోట టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొన్ని వందల వేల స్వామి వారి ఫొటోలు అన్ని కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో, మల మూత్రాల మధ్య పడేశారు. టీటీడీ వాళ్లు పడేశారు అని చెప్పడం లేదు.. విజిలెన్స్ వైఫల్యం చూపిస్తున్నాం. గత రెండేళ్ల పాలనలో టీటీడీ ప్రక్షాళన చేస్తున్నామని చెబుతున్నారు. కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసే వారు సిగ్గుతో తలదించుకోవాలి.
స్వామి వారి చిత్రపటాలు మల మూత్రాల మద్య, బీరు బాటిల్స్ మధ్య ఉన్నాయి. వీటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మీకు లేదా?. నిర్లక్ష్యంగా వదిలివేసి టీటీడీ చోద్యం చూస్తోంది. మీ పాలనలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి అనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. టీటీడీ పాలకులు, అధికారులు సిగ్గుపడాలి. సనాతన ధర్మం సాంప్రదాయం కాపాడతామన్న ఉపముఖ్యమంత్రి పవనానంద స్వామి.. మీ సనాతనం ఎలా ఏడ్చి చచ్చిందో ఓసారి వచ్చి చూడండి. ప్రక్షాళన చేస్తామన్నా పవనానంద స్వామి.. ఇదేనా ప్రక్షాళన, మీ పాలన అంతా అవినీతిమయమే’ అంటూ మండిపడ్డారు.


