
ప్రవీణ్కుమార్
పత్తికొండ స్టేషన్లో పోలీసు అధికారి సివిల్ పంచాయతీ
తీసుకున్న అప్పు చెల్లించాలంటూ పచ్చిబూతులు
గడువులోగా చెల్లించకపోతే రౌడీషిట్ తెరుస్తానంటూ బెదిరింపు.. బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు
ఈ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన బాధితుడు
తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ కూటమి నాయకులు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలను బెదిరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పోలీసుల మాదిరిగానే కర్నూలు జిల్లా పత్తికొండ సీఐ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక మండల పరిధిలోని దూదేకొండ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పి.ప్రవీణ్కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు.
పోలీస్స్టేషన్లో బెదిరింపులు..
రెండేళ్ల క్రితం దూదేకొండ గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి నుంచి రూ.10 వడ్డీతో ప్రవీణ్కుమార్ రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. రూ.50 వేలు చెల్లించాడు. ఇంకా రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. అయితే, కృష్ణమూర్తికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ మునిలక్ష్మి కుమారుడు రంగస్వామి, రంగన్న ఇద్దరు కలిసి పోలీసుస్టేషన్కు వచ్చి అధికార పార్టీ నాయకుల సహకారంతో సీఐ జయన్నపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రవీణ్కుమార్ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో వారు ఒత్తిడి పెంచారు. పైగా.. గతంలో కొంత చెల్లించినా కూడా మళ్లీ అప్పు ఉన్నట్లుగా ప్రామిసరి నోటు రాయించారు.
మిగిలిన బాకీ రూ.50వేలు తనకిస్తే అప్పు ఇచ్చిన వారికి తాను ఇచ్చి సెటిల్చేస్తానని సీఐ కొద్దిరోజుల క్రితం చెప్పారు. అలాగే, పొలం అమ్మకానికి సంబంధించిన మరో అంశంలో కూడా ప్రవీణ్కుమార్ వేరొకరికి ఇవ్వాల్సిన రూ.లక్ష నగదు, తలారి కృష్ణమూర్తికి ఇవ్వాల్సిన రూ.50వేలు మే 31లోగా చెల్లించకపోతే రౌడీషిట్ ఓపెన్ చేస్తానని పచ్చిబూతులు తిడుతూ బెదిరించారు.
అంతేకాక.. గతంలో జరిగిన ఇంటి గొడవలో ఎలాంటి విచారణ చేపట్టకుండానే ప్రవీణ్కుమార్, అతని భార్యపై కేసు నమోదు చేశారు. జేఎం తండా, హోసూరుకు చెందిన ఇద్దరి వద్ద చీటీ విషయమై రాసుకున్న ప్రామిసరీ నోటుకు బదులుగా పోలీసుస్టేషన్లో మరో ప్రామిసరీ నోటు బలవంతంగా రాయించారు. ఇలా కక్షపూరితంగా టార్గెట్ చేసి వేధిస్తుండడాన్ని భరించలేక తాను పురుగుల మందు తాగినట్లు బాధితుడు ప్రవీణ్కుమార్ చెప్పాడు.