సాక్షి, తాడేపల్లి: విశాఖ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగన్, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వైఎస్ జగన్ కోరారు.


