సాక్షి, అమరావతి/కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. 21న సాయంత్రం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 22న ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.
ఇటీవల మృతి చెందిన స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 23న ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.


