రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | Ys Jagan Press Meet On June 11 2026 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Jun 10 2026 6:24 PM | Updated on Jun 10 2026 6:55 PM

Ys Jagan Press Meet On June 11 2026

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం (జూన్‌ 11, గురువారం) 11 గంటలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, రెండేళ్ల ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మాట్లాడనున్నారు. కాగా, వైఎస్‌ జగన్‌ ఇవాళ (బుధవారం) విశాఖపట్నంలో పర్యటించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పారు.

తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌.. తొలుత సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం కిమ్స్‌ ఆస్పత్రికి చేరుకున్న ఆయన, అక్కడ కూడా స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధితులను, క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబాలను ఓదార్చారు. బాధితుల పరామర్శ తర్వాత సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఒకవేళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోతే.. కొంచెం ఓపిక పట్టాలని, దేవుడి దయ వల్ల తమ ప్రభుత్వం ఏర్పడగానే, నెల రోజుల్లో కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన వెల్లడించారు. సంస్థలో గతంలో జరిగిన ప్రమాదాల్లో బాధితులకు కనుక, తగిన సహాయం అంది ఉండకపోతే, వారిని కూడా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
   

Advertisement
 
Advertisement
Advertisement