సాక్షి,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ సాయి తల్లిని, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయి అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘విజయవాడ నడిబొడ్డున కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి నివాసం, ఇక్కడే డీజీపీ కార్యాలయం. ఇక్కడే విజయవాడ పోలీసు కమీషనరేట్, ఇక్కడే ఎసీపీ పరిధిలో .. ఇదే కృష్ణలంక పోలీస్టేషన్. ఈ తల్లి తనకు న్యాయం చేయాలంటూ రోధిస్తున్న దృశ్యం. చంద్రబాబునాయుడు దగ్గర ఉండి ప్రోత్సహిస్తున్న వ్యవస్థలతో రాష్ట్రంలో పోలీస్టేషన్ లకు అన్యాయం జరిగిందని పోయేందుకు భయపడే విధంగా పాలన సాగుతుంది. సీపీ, ఎసీపీ, సీఐ అందరూ కూడబలుక్కుని డీజీపీ సైతం ఇన్ వాల్వు అయ్యి ఒకరికొకరు ప్రొటెక్టు చేసుకుంటున్నారని చెప్పేందుకు నిదర్శనం.
సాయికృష్ణది ఒక ఘటనైతే.. రెండోది క్రాంతి కుమార్ సుసైడ్ ఘటన. సీఐ తనను రోజూ కొడుతున్నాడని, తట్టులేక పోతున్నానని మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. మే 9వ తేదీన సాయి ఘటన కూడా జరిగింది. ఆనాటి నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఆవేదన చెందుతుంది
నీ కొడుకు ఫొటోకి దండ వేసుకో అని సీఐ.. ఆ తల్లిని హేళనగా మాట్లాడాడు. మే 9 నుంచి ఆ తల్లి ప్రతిరోజూ పోలీస్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. నా కొడుకును నాకు చూపించాలని ప్రతిరోజూ బాధపడుతున్న తీరు కనిపిస్తుంది. ఆ అబ్బాయి పిన్ని కనకదుర్గ అనే న్యాయవాది డీజీపీ ఆఫీస్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది.
ఆ ఫిర్యాదు సీపీకి పంపిస్తే.. చర్య తీసుకోకుండా తల్లి దగ్గరకు ఇతరులను పంపించి బేరం చేశారు. హైకోర్టులో తన కొడుకు ఆచూకీ తెలపాలని ఆ తల్లి ఆవేదనతో పిటీషన్ వేసింది. కోర్టు స్పందించి దీనిపై విచారణ కూడా చేపట్టింది. ఆ తల్లి ఆవేదన పై అందరూ స్పందిస్తే.. సీఐని సస్పెండ్ చేశారు. ఆ సీఐని సస్పెండ్ చేశారంటే.. సాయిని చంపినట్లు ఒప్పుకున్నట్లే కదా. ఆ సీఐని ప్రొటెక్టు చేస్తూ ఏసీపీ, సీపీ, డీజీపీ వరకు ఎవరకి వారు ప్రొటెక్టు చేసుకుంటున్నారు.
ఇదే పోలీస్టేషన్ లో కొడుతూ కొడుతూ ఒకరి చావుకు కారణమైతే, మరొకరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు.సస్పెండ్ అంటే.. తాత్కాలికంగా ఆ సీఐని విధుల నుంచి తప్పించడం. ఒక వ్యక్తిని చిత్ర హింసలు పెట్టి హత్య చేస్తే.. కేవలం టెంపరరీగా సస్పెండ్ చేస్తారా?. ఈ విషయం బయటకు రాకపోయి ఉంటే.. సస్పెండ్ చర్యలు కూడా ఉండేవి కావు. ఈ కేసులో సీఐ, ఎసీపీ, సీపీ, డీజీపీ వరకు హత్య కేసు నమోదు చేయాలి. కేవలం కంటి తుడుపు చర్యల కోసమే సీఐని తప్పించారు.ఆ పిల్లాడు వయస్సు 23యేళ్లు.. తెలుసో తెలియకో తప్పు చేసి ఉండవచ్చు.
ఆ తప్పులకు శిక్షలు వేసేందుకు కోర్టులు ఉన్నాయి. హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. పోలీసులు అతన్ని పట్టుకుని కోర్టులో పెడితే.. వాదనలు విన్న తర్వాత శిక్షిస్తాయి.. ఇక్కడ కోర్టు పాత్రను పోలీసులే చేతుల్లోకి తీసుకుని ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణం అయ్యారు. ఇటువంటి పోలీసులకు వత్తాసు పలుకుతుంటే.. సీఎం కేవలం ఒక అధికారిని సస్పెండ్ చేసి ఊరుకున్నారు.
దీనికి పుల్ స్టాప్ పడాలంటే సీబీఐ విచారణ జరగాలి.. అందరి పాత్రలు బయటకు రావాలి. ఈ క్రైంలో సీఐ ఒక్కరే కాదు.. ఎసీపీ, సీపీ, డీజీపీ వరకు ఇన్వాల్వ్ అయినట్లు కనిపిస్తుంది. సీబీఐ విచారణ ద్వారానే ఈ కేసులో న్యాయం జరుగుతుంది. ఆ తల్లి చేసే న్యాయపోరాటంలో వైఎస్సార్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. మే 9వ తేదీ నుంచే సాయి అదృశ్యమైనా, మరొకరు ఆత్మహత్య చేసుకున్నా చర్యలు లేవు. జూన్లో విషయం బయటకు వచ్చిన తర్వాత కేవలం సస్పెన్షన్ మాత్రమే చేశారంటే
ఈ క్రైం బయటకు రాకుండా, కుటుంబం వద్దకు పంచాయతీలు చేసేందుకు పోలీసులు, జనసేన పార్టీ ఇన్ ఛార్జిలను పంపిస్తున్నారు. ఈ కేసులో విచారణ చేసేందుకు ఐపీఎస్ అధికారిని నియమించారంట.. పోలీసులపై పోలీసుల విచారణతో న్యాయం జరగదు. సీబీఐ విచారణ ద్వారానే భాధ్యుల అందరిపైనా చర్యలు ఉంటాయి.సీఐ నుంచి డీజీపీ వరకు అందరూ ఇన్ వాల్స్ అయిన విధానం బయటకు రావాలి. ఎవరెవరికి తెలిసి ఇది జరిగిందీ.. ఎవరు కాపాడుతున్నారు.. లాకప్ డెత్లు ఎందుకు జరుగుతున్నాయో మొత్తం బయటకు రావాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.


