సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: యూకే వీసా రెన్యువల్, ఉద్యోగాల మోసం కేసుకు సంబంధించి ఏపీ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ నందూస్ వరల్డ్ అలియాస్ రమానందన విచారణ ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఈ కేసు విచారణపై ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం పలు కీలక విషయాలు వెల్లడించారు.
బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు రమానందన, ఆమె భర్త మధుకర్, మధుకర్ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, తాము విచారణకు హాజరవుతామని, లుక్ అవుట్ నోటీసులు ఎత్తివేయాలని రమానందన మెయిల్ ద్వారా కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు.
పోలీసుల విచారణలో వీసా రెన్యువల్ లావాదేవీలతో తనకేం సంబంధం లేదని రమానందన తెలిపినట్లు సీఐ తెలిపారు. ‘డెస్టినీ కన్సల్టెన్సీ’తో తనకెలాంటి సంబంధం లేదని, ఆ వ్యవహారమంతా తన భర్త మధుకరే చూసుకుంటాడని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. తనకు ఏమీ తెలియదని, తన భర్తనే అడగాలని రమానందన విచారణలో పేర్కొన్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
విచారణ నిమిత్తం రమానందన మూడు వారాల సెలవుపై ప్రస్తుతం ఇండియాకు వచ్చారు. ఆమె తిరిగి యూకే వెళ్లిన తర్వాత ఆమె భర్త మధుకర్ విచారణకు వస్తారని చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 16న రమానందనను మరోసారి విచారించనున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించారు.
యూకే వీసా రెన్యువల్స్, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరుతో డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ రమానందనపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్తో పాటు మరికొన్ని చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇబ్రహీంపట్నం తరలించి ఈ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఆమెను పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం విచారిస్తున్నారు.
👉ఇదీ చదవండి : పోలీసుల అదుపులో నందూస్ వరల్డ్


