సాక్షి,చిత్తూరు: కుప్పంలో డీఎస్సీ అక్రమాలపై వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి టీవీ ప్రతినిధులు కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరిస్తున్న సాక్షి టీవీ కుప్పం రిపోర్టర్ గణేష్, కెమెరామెన్ శ్రీకాంత్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డీఎస్సీ అక్రమాల కథనాలపై దృష్టి మళ్లించేందుకు, విధుల్లో ఉన్న జర్నలిస్టులపై ఓ ఉపాధ్యాయుడితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. జర్నలిస్ట్ తమపై దాడి చేశారని, కాలర్ పట్టుకుని బెదిరించారంటూ తప్పుడు ఆరోపణలతో ఈ కేసు బనాయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను వెలికితీస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి అక్రమ కేసులు బనాయించడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో సాక్షి టీవీ సిబ్బందిపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ చిత్తూరు ప్రెస్ క్లబ్ సభ్యులు, పలువురు మీడియా ప్రతినిధులు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసుల నమోదును ఆపాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


