కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం పోసినవారి పాలెం పంచాయతీ పరిధిలోని పొట్టేలగుంటపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మృతులు అనుముకొండ రజని (60), ఆమె కుమార్తె తోట గౌరి (40), కోడలు మధు (35)గా పోలీసులు గుర్తించారు. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు మృతిచెందిన ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సమస్యల కారణంగానే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అసలు కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


