శ్రుతి తప్పిన రుతురాగం | The weather seasons have changed in the state | Sakshi
Sakshi News home page

శ్రుతి తప్పిన రుతురాగం

Jun 8 2025 3:09 AM | Updated on Jun 8 2025 5:37 AM

The weather seasons have changed in the state

వేసవిలో వానలు.. వానా కాలంలో ఎండలు 

రాష్ట్రంలో తారుమారైన వాతావరణ సీజన్లు 

మే నెలలో ఊహించని వానలు 

నైరుతి ప్రవేశించినా జూన్‌లో ఎండల తీవ్రత  

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల అస్థిర వాతావరణం 

రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ సీజన్లు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మండు వేసవిలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడగా.. వర్షాల సీజన్‌లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత నెలాఖరుకే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి అన్నిచోట్లకు విస్తరించినా.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మందగించాయి. దీంతో వారం రోజులుగా రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి.

విజయవాడ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం వంటి కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు వాస్తవ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. విజయవాడలో శనివారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావం కనిపించింది. 

ఉదయం నుంచి రాత్రి వరకూ వేడి వాతావరణం ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రోహిణీ కార్తె కావడంతో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటోంది. 15 రోజుల క్రితం వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండాల్సిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి.  –సాక్షి, అమరావతి

సీజన్లు ఇలా మారాయి
సాధారణంగా మార్చి నుంచి మే నెలాఖరు వరకూ వేసవి సీజన్‌. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ వర్షాకాలం ఉంటుంది. కానీ.. ఈ ఏడాది సీజన్లు తారుమారయ్యాయి. మే నెలలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, విజయవాడ, గుంటూరు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వేసవి అంతా వర్షాకాలంలా మారిపోయింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తొలకరి వర్షాలు కురవడం లేదు. ఎండలు తగ్గాల్సిన జూన్‌లో మండిపోతోంది. కోస్తా ప్రాంతాల్లో వీచే గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటంతో నమోదైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. 

వాతావరణ మార్పులతో అస్థిరంగా రుతుపవనాలు
గ్లోబల్‌ వారి్మంగ్‌ వల్ల వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు రుతుపవనాల సమయాన్ని, తీవ్రతను అస్థిరపరచడమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు పెరగడంతో తేమ స్థాయిలు పెరుగుతూ వర్షాలను అస్థిరపరుస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల అకాల వర్షాలకు కారణమవుతుండగా.. వేడి గాలులు, తక్కువ వాయు ప్రవాహం ఎండల తీవ్రతను పెంచుతున్నట్టు చెబుతున్నారు.

జూన్‌ నెలాఖరు వరకు ఎండలు
ముందుగానే వచ్చిన రుతు పవనాలు ప్రస్తుతం మందగించాయి. నాలుగు రోజులుగా వాటిలో ఎలాంటి కదలిక లేదని వాతా­వరణ శాఖ తెలిపింది. వాటిని బలపరిచే ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో స్థిరంగా ఉన్నచోటే ఉండిపోయాయి. జూన్‌ 15 తర్వాత కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఏదైనా జూన్‌ మధ్య నుంచి జూన్‌ చివరి వారం వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలై మొదటి వారం నుంచి వర్షాలు స్థిరంగా కురిసే అవకాశం ఉందని.. అప్పటివరకూ ఎండల తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement