బైక్‌పై నుంచి కళ్లు తిరిగి పడి మహిళ బ్రెయిన్‌ డెడ్‌.. పేద గుండెకు పునర్జన్మ

Vizag Brain Dead Woman Heart Transplant 15 Yr Boy Success In Tirupat - Sakshi

తిరుపతి తుడా/అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు బ్రెయిన్‌ డెడ్‌ కావటంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను శుక్రవారం ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండెజబ్బుతో బాధపడుతున్న 15ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ కింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. నిజానికి.. 2021 అక్టోబర్‌ 11న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ చికిత్సాలయాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో.. తొలిసారి ఇక్కడి వైద్యులు గుండెమార్పిడి చేశారు. ఈ యజ్ఞం పూర్వాపరాలు ఇవిగో..

 

పేద రైతుకు పెద్ద కష్టం.. 
అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకూలీ నెలరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన పదిహేనేళ్ల కుమారుణ్ణి పద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పారు. జీవన్‌దాన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది.  

విశాఖపట్నంలో మహిళకు బ్రెయిన్‌ డెడ్‌ 
ఇంతలో.. విశాఖపట్నంలోని భెల్‌ (హెచ్‌పీవీపీ)లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జంజూరు ఆనందరావు భార్య సన్యాసమ్మ (48) టౌన్‌షిప్‌లో ఉంటున్నారు. వీరి ఇద్దరి కుమారులూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. సంక్రాంతి సందర్భంగా సన్యాసమ్మ పెందుర్తి సమీప గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 17న తన కుమారుడితో బైక్‌పై తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమవడంతో షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించటంతో వైద్యులు జీవన్‌దాన్‌ సైట్‌కు సమాచారమిచ్చారు. 

స్పందించిన సీఎంఓ.. 
సన్యాసమ్మ గుండె తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చి­కిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశ­ముం­దన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కా­ర్యాలయం రెండు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వై­ద్యు­లను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రా­ఫిక్‌­ను నియంత్రిస్తూ గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రత్యేక వి­మానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లుచేసింది. 

ఆగమేఘాలపై గుండె తరలింపు 
మరోవైపు.. తిరుపతి నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరుచేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దాన్ని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు డీసీపీ ఆనంద్‌కుమార్, ట్రాఫిక్‌ ఏడీసీపీ శ్రావణ్‌కుమార్, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 33 మంది సిబ్బంది భద్రతా, ట్రాఫిక్‌ ఆంక్షలను పర్యవేక్షించారు. షీలానగర్‌ ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ నియంత్రించారు.

ఆ తర్వాత.. 
►9.18 గంటలకు : ఆస్పత్రిలో అంబులెన్స్‌ బయల్దేరింది. 
► 9.20 : ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.  
► 10.05 : అప్పటికే సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం గుండెను తీసుకుని బయల్దేరింది.  
►11.31 : రేణిగుంట విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయింది.  
► 11.35 : విమానాశ్రయం నుంచి బాక్సును బయటకు తీసుకొచ్చారు.  
► 11.56 : టీటీడీ అంబులెన్స్‌లో 21.5 కి.మీ. దూ­రాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మా­వతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు.  
►11.57 : ఒక నిమిషంలోనే ఆస్పత్రిలోకి గుండెను చేర్చారు.  
►అప్పటికే ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో సిద్ధంచేసి ఉంచారు.  
►ఆరుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4.15 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేసింది.  

అందరి సహకారంతోనే..  
దాత కుటుంబ సభ్యులు, ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు, వైద్యుల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది. గుండెను తగిన జాగ్రత్తలతో భద్రపరిస్తే ఆరు గంటల వరకు పనిచేస్తుంది. సన్యాసమ్మ గుండెను మూడు గంటల్లోపే తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అమర్చిన గుండె పూర్తి సామర్థ్యంతో పనిచేసి బాలుడు కోలుకునేందుకు వారం రోజులు పడుతుంది.  
– డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి 

ఆమెలేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా 
సన్యాసమ్మ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ఇప్పటివరకు నేను, పెద్దబ్బాయి చైతన్య, చిన్నబాబు జయప్రకా‹Ùలు తేరుకోలేదు. ఇద్దరు కుమారులను కంటికి రెప్పలా చూసుకుని మురిసిపోయేది. వారికి ఏది కావాలన్నా నాతో గొడవపడి మరీ సాధించేది. 
– జంజూరు ఆనందరావు, సన్యాసమ్మ భర్త, భెల్‌ ఉద్యోగి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top