
సాక్షి, విశాఖపట్నం: భారీగా ఈ- సిగిరెట్స్, మొబైల్ఫోన్స్ అక్రమంగా తరలిస్తున్న ఇద్దర్ని వైజాగ్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కౌలాలంపూర్ నుంచి నిషేధిత ఈ–సిగిరెట్స్ తరలిస్తుండగా.. వీరి వద్ద నుంచి రూ.66.90 లక్షల విలువైన ఈ–సిగరెట్స్, మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఏకే–83 విమానంలో విశాఖ ఎయిర్పోర్టులో కొలిపర్తి జయ నరేంద్రకుమార్, ఏటుకూరి లక్ష్మీనారాయణ బుధవారం రాత్రి దిగారు.
వీరి లగేజీలో అనుమానిత వస్తువులు ఉన్నట్లు భావించి.. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏటుకూరి లక్ష్మీనారాయణ బ్యాగ్లో రూ.33,96,008 విలువైన 29 ఐఫోన్ 16 ప్రో, ప్రోమ్యాక్స్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.3,30,750 విలువైన 21 ఈ-సిగరెట్ పెట్టెలు(105 ఈ–సిగరెట్స్) చొప్పున మొత్తం రూ.37,26,758 విలువైన వస్తువులు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కొలిపర్తి జయ నరేంద్ర కుమార్ బ్యాగ్లో రూ.27,43,351 విలువైన 22 ఐఫోన్ 16 ప్రో, ప్రోమ్యాక్స్ ఫోన్లు, రూ.2,20,500 విలువైన 14 ఈ సిగరెట్ పెట్టెలు(90 ఈ-సిగరెట్స్) చొప్పున మొత్తం రూ.29,63,851 విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.