ఉపరాష్ట్రపతిని కలిసిన విజయసాయిరెడ్డి
ఢిల్లీ : వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డి బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలిశారు. వ్యవసాయం, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తి ఎగుమతులకు సంబంధించిన నివేదికను ఉపరాష్ట్రపతి వెంకయ్యకు సమర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. టీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోషన్ చేపట్టడంతో పాటు పొగాకు ఉత్పత్తులపై బ్యాలెన్స్ పద్ధతి రావాలన్నారు. పొగాకు ఉత్పత్తులను కేవలం ఎగుమతుల వరకే పరిమితం చేయాలి.. ఇలా చేయడం వల్ల రైతులకు, రైతుకూలీలకు నష్టం జరగదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.