
సాక్షి,విజయవాడ: పలు అనారోగ్య సమస్యలతో గత మూడు రోజులగా ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
గత మూడు రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్దారించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు.
వంశీ ఐసీయూలో లేనందున ఆరోగ్యం కుదుటపడేందుకు స్లీప్ మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులు వంశీకి అందించిన చికిత్స తాలూకూ మెడికల్ రిపోర్టులు, డిశార్జ్ సమ్మరీతో సహా సీల్డ్ కవర్లో ఈనెల 5వ తేదీన జైలు అధికారులు హై కోర్టుకు సమర్పించనున్నారు.
గత గరువారం ..వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం (జూన్ 5) నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు.