పద్మనాభరెడ్డి పట్టాదారు పాసుపుస్తకం
భూమిని అమ్ముకోనివ్వకపోవడంతో అన్నదాత హఠాన్మరణం
నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రైతు పద్మనాభరెడ్డి
భూ సేకరణ పేరుతో నోటీసులిచ్చిన అధికారులు
రూ.కోట్ల ఆస్తి ఉన్నా సరైన వైద్యం పొందలేక గుండెపోటుతో మృతి
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటున్న రైతులు
నా కళ్లముందే పొలాల్లోంచి రైతుల్ని బలవంతంగా ఈడ్చేశారు. రేపు మన పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటుందని భయమేస్తోంది. ఇంత ఆస్తి ఉండి కూడా వైద్యం చేయించుకోలేకపోతున్నాను. పిల్లలకు ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా తలచుకుంటే మనందరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.
– ఉండవల్లిలో ప్రభుత్వ దాషీ్టకం అనంతరం పద్మనాభరెడ్డి ఆవేదన
తాడేపల్లి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ చర్యల కారణంగా రాజధాని ప్రాంతమైన అమరావతిలో సోమవారం ఓ రైతు గుండె ఆగింది. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రైతు గుంటక పద్మనాభరెడ్డి (58) తనకున్న భూమి అమ్ముకుని వైద్యం చేయించుకుందామంటే ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది. దీంతో సరైన వైద్య సేవలు అందక పద్మనాభరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.

ఆదివారం రాత్రి డయాలసిస్ చేయించుకునేందుకు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. హార్ట్బీట్ పెరిగినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. ఆయనను తక్షణమే ఆస్పత్రిలో చేరాలని, సోమవారం గుండెకు సంబంధించిన వైద్యచికిత్సలు కూడా అందిస్తామని చెప్పారు. దీంతో పద్మనాభరెడ్డి వెంటనే ఆస్పత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున విపరీతమైన గుండెనొప్పి రావడంతో వైద్యసేవలు అందించేలోపే ఆస్పత్రిలోనే మరణించారు.
రూ.కోట్ల విలువైన ఆస్తి ఉన్నా..
పద్మనాభరెడ్డికి ఉండవల్లి–అమరావతి రోడ్డులో 1.40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ల్యాండ్ ఫూలింగ్ పరిధిలో ఉండటంతో ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బలవంతపు భూ సేకరణకు నోటీసులు అందజేసింది. ఈ భూమిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. పద్మనాభరెడ్డి నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆయన మరింత కుంగిపోయారు.

‘వైద్యం చేయించుకోవడానికి నావద్ద డబ్బులు లేవు’
పద్మనాభరెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కిడ్నీ సమస్య ఉండటంతో ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. రాజధానిలో అందరికీ ఎనీ్టఆర్ భరోసా కింద ఉచిత వైద్యం అందిస్తామన్నారు. అదీ చేయడం లేదు. నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి డబ్బులు కూడా లేవు. భూమిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో వైద్యం చేయించుకుందామంటే.. అమ్ముకోవడానికి వీల్లేకుండా రిజిస్ట్రేషన్లు ఆపేశారు. నేనేం చేయాలి’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశి్నంచారు.
పోలీసుల్ని దించి.. రైతుల్ని ఈడ్చేయడంతో మనస్తాపం
కొద్దిరోజుల క్రితం ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్ కోసం 11మంది రైతులకు చెందిన 2.40 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. పొలాల్లో వందలాది పోలీసులను దించింది. అక్కడి పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతు కుటుంబాలను బయటకు ఈడ్చేసి దౌర్జన్యంగా పంటలను ధ్వంసం చేయడంతోపాటు భూమిని చదును చేసి రోడ్లు వేశారు. ఈ ఘటనతో పద్మనాభరెడ్డి తీవ్రంగా మనస్తాపం చెందాడు. తోటి రైతులకు ఫోన్లుచేసి ‘నా కళ్లముందే పొలాల్లోంచి రైతుల్ని బలవంతంగా ఈడ్చేశారు. రేపు మన పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటుందని భయమేస్తోంది.
ఇంత ఆస్తి ఉండి కూడా వైద్యం చేయించుకోలేకపోతున్నాను. పిల్లలకు ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా తలచుకుంటే మనందరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’ అని వాపోయినట్టు పలువురు రైతులు తెలిపారు. భూముల్ని బలవంతంగా లాగేసుకుంటున్నారన్న ఆందోళనతోనే పద్మనాభరెడ్డి మృతి చెందాడని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వారంతా చెబుతున్నారు.


