డాబాగార్డెన్స్: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం మంగళవారం విశాఖలో జరగనుంది. మద్దిలపాలెంలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు.
ఈ నెల 14 నుంచి ప్రజాప్రతినిధులను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించే కార్యక్రమం, ప్రభుత్వానికి డిమాండ్లను తెలియజేసే తదుపరి చర్యలపై చర్చించనున్నట్లు జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు సోమవారం తెలిపారు. సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న 30 ప్రధాన సమస్యలు, డిమాండ్లతో రూపొందించిన సమగ్ర నివేదిక (బుక్లెట్)ను ఆవిష్కరిస్తారు.


