
స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యంతో సివిల్ సప్లయిస్ సిబ్బంది
అక్రమంగా రేషన్ బియ్యం రవాణా
రైస్ వైన్లో బియ్యాన్ని వినియోగిస్తున్న చైనా
అక్కడి డిమాండ్ను సొమ్ముచేసుకుంటున్న మాఫియా
రేషన్ షాపుల ఏర్పాటుతో చెలరేగిపోతున్న ముఠా
తాజా దాడుల్లో 473 టన్నుల బియ్యం పట్టివేత
కీలక సూత్రధారి టీడీపీ కార్గో వ్యాపారే..!
రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్ నివేదికలు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని రేషన్ బియ్యం విశాఖ నుంచి చైనాకు ఎగుమతి అవుతోంది. చైనాలో రైస్ వైన్గా పిలిచే సంప్రదాయ మద్యపానీయం హువాంగ్జియు తయారీలో విరివిగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. అక్కడి డిమాండ్కు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు విశాఖలోని పలు షిప్పింగ్ కంపెనీలు రేషన్ బియ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాయి.
రేషన్ మాఫియా ద్వారా సేకరించి చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 473 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పలు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్టీ)ల్లో ఈ నెల 23, 24 తేదీల్లో దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందులో శ్రావణ్ షిప్పింగ్ సర్విసెస్ వద్ద 150 మెట్రిక్ టన్నుల బియ్యం, గేటు వే ఈస్ట్ ఇండియా సీఎఫ్టీలో 156 మెట్రిక్ టన్నులు, పంచవటి టోల్గేట్ వద్ద 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారమంతా ప్రధానంగా టీడీపీకి చెందిన కార్గో వ్యాపారే నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి. పట్టుకున్నవి రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్ల ద్వారా నివేదికలు తెచ్చుకునేందుకు వ్యవహారం నడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతా అమ్యామ్యాలే...!
కొన్నాళ్ల క్రితం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. దీంతో సాధారణ బియ్యం ఎగుమతి కూడా అక్కడి నుంచి చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది విశాఖ నుంచి ఎగుమతులకు తమ మకాం మార్చారు. రేషన్ బియ్యం మాఫియా కూడా వారితో పాటు విశాఖ నుంచి చైనాకు బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించింది.
తాజాగా రేషన్ డిపోలు కూడా ఏర్పాటు కావడంతో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలోని రేషన్ మిల్లులతో పాటు పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లోని రేషన్ మిల్లుల కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్కడ సన్న బియ్యంగా మలుస్తున్నారు. వివిధ దేశాల ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులను కస్టమ్ హౌస్ బ్రోకరేజీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనంతరం కస్టమ్స్ నుంచి అనుమతులు పొందుతున్నాయి.
తరువాత రేషన్ మిల్లుల నుంచి తీసుకొచ్చి విశాఖలో ఉన్న పలు కంటైనర్ టెరి్మనల్ ఫ్రైట్ స్టేషన్ల (సీఎఫ్టీ)లో నిల్వ ఉంచి.. కంటైనర్ల ద్వారా ఎగుమతులు చేపడుతున్నారు. టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయాల్సిన అధికారులు.. కూడా ఈ రేషన్ మాఫియాతో చేతులు కలుపుతున్నారు.
ల్యాబ్ నివేదిక పేరుతో...!
పట్టుకున్న బియ్యం నమూనాలను ల్యాబ్కు పంపించామని.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు మొదటి దాడుల్లో పట్టుకున్న 150 మెట్రిక్ టన్నుల బియ్యంలో పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా.. రేషన్ బియ్యం కాదని నివేదిక వచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన బియ్యం నమూనాల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
ఈ నివేదికలు కూడా రేషన్ బియ్యం కాదని వస్తాయా? అవునని వస్తాయా అనేది చూడాల్సి ఉంది. దాడుల్లో పట్టుకున్న బియ్యం అనుమానిత ప్రజా పంపిణీ బియ్యం అని స్పష్టంగా ప్రకటనల్లో పేర్కొన్న అధికారులు.. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా, నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం విశేషం.
చైనా డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకే...!
వాస్తవానికి చైనాలో సంప్రదాయ రైస్ వైన్కు డిమాండ్ ఉంది. చైనీస్ రైస్ వైన్ అని కూడా పిలువబడే హువాంగ్జియును ప్రధానంగా చైనాలోని జియాంగ్నాన్ ప్రాంతంలో ఉడికించిన బియ్యాన్ని పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనికి ఉండే ప్రత్యేకమైన రుచితో పాటు తక్కువ ఆల్కహాల్ (8 నుంచి 20) శాతం, మంచి పోషక విలువలు ఉండటంతో చైనీయులు ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయి.
దీనికి 5 వేల సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగి ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో ఉండే ఈ రైస్ వైన్ డిమాండ్కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి బియ్యాన్ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అక్కడి డిమాండ్ ఇక్కడి రేషన్ బియ్యం మాఫియాకు కలిసివస్తోంది. ఇక్కడి నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయడంలో టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.