సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఘటన జరిగింది. మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్ రాజ్ (36), నరేష్(21)గా గుర్తించారు.
సెల్ ఫోన్ పడిపోయిందని దుప్పట్లు కట్టుకొని బావిలోకి దిగిన భీమ్ రాజ్, అతడు రాకపోయేసరికి కాపాడే ప్రయత్నంలో నరేష్ బావిలోకి దిగి మృతి చెందారు. విష వాయువులు పీల్చడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


