నోటి మాటతో గోడ కట్టారు | There is no design or permission for the wall construction says Commission members | Sakshi
Sakshi News home page

నోటి మాటతో గోడ కట్టారు

May 3 2025 3:58 AM | Updated on May 3 2025 3:58 AM

There is no design or permission for the wall construction says Commission members

త్రిసభ్య కమిషన్‌ చైర్మన్‌ సురేష్ కుమార్‌ 

సాక్షి, విశాఖపట్నం: ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినా సింహగిరిపై ఏడుగురు భక్తుల ప్రాణాలు బలై పోయిన నేపథ్యంలో తన దారుణ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి సర్కారు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు గోడ నిర్మాణంలో వైదిక నియమాల ఉల్లంఘన జరిగిందా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చేపట్టారా? అనే అంశాలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దేవదాయ – పర్యాటక శాఖల మధ్య సమన్వయం లోపించిందంటూ పక్కదారి పట్టించే ఎత్తుగడలకు తెర తీసింది. 

మంత్రుల పర్యవేక్షణలోనూ ఇంత దారుణం జరగడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నా మభ్యపుచ్చే యత్నాలు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది.  సింహాచలంలో భక్తుల మృత్యువాతపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన త్రిసభ్య కమిషన్‌ శనివారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. తొలిరోజు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఈవో, ఏఈవో,  దేవస్థానం అధికారులను విచారించగా రెండోరోజు సర్క్యూట్‌ హౌస్‌లో విచారణ జరిపారు. నోటిమాటతో గోడ కట్టారని.. ఎలాంటి డిజైన్, అనుమతులు లేవని ప్రాథమికంగా తేలినట్లు కమిషన్‌ సభ్యులు చెప్పారు. 

సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై సురేష్ కుమార్‌ చైర్మన్‌గా, సభ్యులు ఆకె రవికృష్ణ, వెంకటేశ్వరరావులతో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన మ్యాప్‌లు, డ్రాఫ్ట్‌ కాపీలను కమిషన్‌ సేకరించింది. గోడ నిర్మాణం చేపట్టొద్దని ముందుగానే అధికారుల్ని హెచ్చరించామని దేవస్థానం అర్చకులు, వైదిక పండితులు పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్‌ హరేంధిరప్రసాద్, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ విచారణకు హాజరై తాము సేకరించిన వివరాలను కమిషన్‌కు అందించారు. 

ఇంజనీర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సీపీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఏప్రిల్‌ 29, 30వ తేదీలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ ఫుటేజీని స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం కమిషన్‌ చైర్మన్‌ సురేష్ కుమార్‌  మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ‘శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తాం. పూర్తిస్థాయి నివేదికకు నెల సమయం ఉన్నందున మరికొంత మందిని విచారిస్తాం. మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా కొన్ని పనులు జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి. ఎవరి ఆమోదంతో మార్పులు చేశారో తెలియాల్సి ఉంది. గోడ నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు లేవు. 

ఎవరు అనుమతి ఇచ్చారు? స్ట్రక్చరల్‌ డిజైన్లు, మెటీరియల్‌కు సంబంధించి ఒక్క రికార్డు కూడా లేదు. కేవలం నోటిమాట ద్వారానే గోడని నిర్మించినట్లు ప్రాథమికంగా నిర్థారించాం. ‘ప్రసాద్‌’ పథకం కింద మంజూరైన పనులు 2024 ఆగస్ట్‌ నాటికే పూర్తి కావాలి. ఆలస్యంపై దేవస్థానం, టూరిజం అధికారులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది..’ అని కమిషన్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement