సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు, ఇసుక మాఫియా.. రైతు పరిరక్షణ కమిటీ నేతల కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను పరామర్శించకుండా పరిరక్షణ కమిటీ సభ్యులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.
అయితే, రాజధానికి భూములు ఇవ్వని రైతులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి అధికారులు కొండవీటి వాగు నీళ్లు వదిలారు. సదరు రైతుల పొలాలను పరిశీలించడానికే ఈరోజు రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ గూండాలు వారిని అడ్డుకుని దాడులకు పాల్పడ్డారు. పచ్చ గూండాల దాడిలో పోలీసులకు సైతం గాయాలు అయ్యాయి. పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.


