
రామసముద్రం పోలీస్ స్టేషన్ను ముట్టడించిన టీడీపీ శ్రేణులు
స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు యత్నం
ఎస్ఐని అప్పజెప్పాలని డిమాండ్
రామసముద్రం: ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మా పార్టీ ప్రభుత్వమే. అలాంటిది మాపైనే కేసులు పెడతారా! మీకెంత ధైర్యం? ఆ ఎస్ఐని మాకు అప్పజెప్పండి. ఆయన సంగతి తేలుస్తాం’ అంటూ అన్నమయ్య జిల్లా ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పోలీస్ స్టేషన్పై దండెత్తారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రబోయినపల్లి, శ్రీరాములవారిపల్లి గ్రామాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండువర్గాలపై రామసముద్రం పోలీసులు కేసులు నమోదు చేశారు.
శ్రీరాములవారిపల్లెకు చెందిన మంజునాథ్ ఫిర్యాదు మేరకు ఎర్రబోయినపల్లెకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన ఎర్రబోయినపల్లి టీడీపీ శ్రేణులు స్టేషన్పైకి దూసుకొచ్చాయి. ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి స్టేషన్ గేటును మూసివేశారు. ఎవరినీ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసి మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ అక్కడకు చేరుకోగా.. ఆయన సమక్షంలోనే టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
తర్వాత అక్కడే ఆందోళన నిర్వహించారు. టీడీపీకి చెందిన తమపైనే కేసు నమోదు చేసేంత ధైర్యం మీకెవరు ఇచ్చారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో రామసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణుల దాడి యత్నంతో ఆందోళనకు గురైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు.
టీడీపీ నాయకుడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో మంజునాథ్ వర్గానికి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రవికుమార్ ప్రకటించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది నిందితులు ఉన్నారని వారిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్యే షాజహాన్బాష పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐ, ఎస్సైలతో సమావేశమయ్యారు.