కానిస్టేబుల్ రాజ్కుమార్ చొక్కా పట్టుకున్న టీడీపీ కార్యకర్త మారుతి
పోలీసులపై టీడీపీ కార్యకర్త వీరంగం
కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దుర్భాషలు
సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ కార్యకర్త ఓ పోలీసు చొక్కా పట్టుకొని పరుష పదజాలంతో వీరంగం సృష్టించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 21న రాయదుర్గంలోని క్రీడామైదానంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీనికి వచ్చిన కణేకల్లుక్రాస్కు చెందిన టీడీపీ కార్యకర్త, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మారుతి తన కారును క్రీడామైదానం ఎంట్రెన్స్లో దారికి అడ్డంగా పెట్టాడు. అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర, కానిస్టేబుళ్లు రాజ్కుమార్తో పాటు మరికొంత మంది అతడిని ‘నీ కారు దారికి అడ్డంగా ఉంది. మరోచోట పార్కింగ్ చేయు’ అని సూచించారు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న మారుతి..‘నేను ఎవరనుకొన్నావ్? నేను కాలవ మనిషిని..కాలవ భరత్కు సన్నిహితుడిని..నా కారును తీసి పక్కనబెట్టమంటారా?’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. ‘లం..కొడకల్లారా! నేను ఎవరనేది తెలియదా? ప్రభుత్వం మాదిరా’ అంటూ దుర్భాషలాడాడు. కానిస్టేబుల్ రాజ్కుమార్ చొక్కా పట్టుకుని ‘నేనేంటో నా తడఖా ఏంటో చూపిస్తా’ అంటూ ఎవరికో ఫోన్ చేస్తూ రెచ్చిపోయాడు.

మంత్రి లోకేశ్తో మారుతి (ఫైల్)
అయితే ఈ ఘటనపై ప్రభుత్వ విప్ కాలవ జోక్యం చేసుకుని ‘వాడు మనోడే.. వదిలేయండి. నో కేస్..నో యాక్షన్’ అంటూ పోలీసులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ‘సార్.. మీ కార్యకర్తే కావచ్చు..పట్టపగలు జనం చూస్తుండగా చొక్కా పట్టుకొని మమ్మల్ని తిడితే ఊరికే ఉండాలా? కొడితే కొట్టించుకోవాలా?’ అంటూ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఒక్కసారికి అతన్ని క్షమించి వదిలేయండంటూ కాలవ చెప్పడంతో పోలీసులు కేసు లేకుండా పంపించేశారు.


