విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతదేహాలకు శవపరీక్షలు (పోస్టుమార్టం) చేసే మార్చురీ సిబ్బంది పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు సోమవారం అర్థరాత్రి 12 గంటల నుంచే మార్చురీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనా స్థలం నుంచి ఒక్కొక్కటిగా వస్తున్న మృతదేహాలను స్వీకరిస్తూ.. వారు అలుపెరగకుండా సేవలందిస్తున్నారు.
ప్రమాద తీవ్రత కారణంగా కుళ్ళిపోయే దశకు చేరిన మృతదేహాలకు సైతం పోస్టుమార్టం నిర్వహించడం, తిరిగి కుట్లు వేయడం వంటి విధులను సిబ్బంది ఎంతో శ్రమకోర్చి చేస్తున్నారు. ఆ దుర్వాసన, ఇన్ఫెక్షన్ల వల్ల తాము ఎక్కడ అనారోగ్యం బారిన పడతామోనన్న భయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు మృతుల కుటుంబాలు తీరని గుండెకోతతో బాధల్లో ఉంటే, మరోవైపు తెల్లవార్లూ శ్రమిస్తున్న ఈ కిందిస్థాయి సిబ్బంది బాగోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీసం ‘భోజనం చేశారా?’ అని అడిగేవారే లేకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


