దుబాయ్‌లో శ్రీకాకుళం మహిళకు భర్త వేధింపులు | Srikakulam woman Harassment by husband in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో శ్రీకాకుళం మహిళకు భర్త వేధింపులు

Dec 20 2022 4:43 AM | Updated on Dec 20 2022 12:51 PM

Srikakulam woman Harassment by husband in Dubai - Sakshi

విమానాశ్రయంలో కావ్య, కుటుంబ సభ్యులు

దుబాయ్‌లో భర్త వేధింపులకు గుర­వు­తున్న శ్రీకాకుళానికి చెందిన మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్‌ఆర్టీఎస్‌) సురక్షితంగా భారతదేశానికి చేర్చింది.

సాక్షి, అమరావతి: దుబాయ్‌లో భర్త వేధింపులకు గుర­వు­తున్న శ్రీకాకుళానికి చెందిన మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్‌ఆర్టీఎస్‌) సురక్షితంగా భారతదేశానికి చేర్చింది. శ్రీకాకుళానికి చెందిన కావ్య, తన భర్త అవినాష్, రెండేళ్ల కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. ఇటీవల భర్త అవినాష్‌ అదనపు కట్నం కోసం తనతోపాటు కుమార్తెను, తల్లిదండ్రులను సైతం వేధిస్తున్నాడని కావ్య ఇటీవల వీడియో ద్వారా తెలియజేసింది.

తాము భారత్‌ రాకుండా అడ్డుకునేందుకు అవినాష్‌ అక్కడి కోర్టును ఆశ్రయించి తన రెండేళ్ల కుమార్తె ప్రయాణంపై నిషేధం విధించేలా చేశాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డ్టాకర్‌ సీదిరి అప్పలరాజు తమ దృష్టికి తీసుకువచ్చారని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ మేడపాటి తెలిపారు.

తాము వెంటనే వివరాలు సేకరించి కావ్య తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లే విధంగా ఎంబసీ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కావ్య కుమార్తెను కూడా స్వదేశానికి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

స్వదేశానికి చేరుకున్న తర్వాత కావ్య సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తాము క్షేమంగా భారత్‌కు చేరుకునేందుకు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ చేసిన సాయం మరువలేనిదని, తన పాపను కూడా తీసుకొచ్చే విధంగా చూడాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.   

Advertisement
 
Advertisement
Advertisement