
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకనున్నాయి. కేరళ రాష్ట్రాన్ని శుక్రవారం రాత్రి తాకిన ఈ రుతుపవనాలు శని, ఆదివారాల్లో కర్ణాటక వ్యాప్తంగా విస్తరించాయి. అక్కడ నుంచి దాదాపు రాయలసీమకు అతిచేరువలోకి సమీపించగా, మన రాష్ట్రంలోకి సోమవారం ప్రవేశించనున్నాయి. దీంతో ఈ ఏడాది వారం రోజులు ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రేపు అల్పపీడనం..
మరోవైపు.. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి∙ఉత్తర ఒడిశా వరకు, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది 27వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే, సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆ సంస్థ పేర్కొంది.
