అమ్మ ఓడి.. 'పోయింది' | Son Attending the last rites with a warning from officials | Sakshi
Sakshi News home page

అమ్మ ఓడి.. 'పోయింది'

Jun 25 2025 6:03 AM | Updated on Jun 25 2025 6:03 AM

Son Attending the last rites with a warning from officials

కన్న కొడుకును చూసి కనుమూయాలని చివరి క్షణం వరకు తల్లి ఆవేదన

20 ఏళ్ల క్రితం విడిచిపోయిన కొడుకు 

తల్లి చావుబతుకుల్లో ఉందంటే చూసేందుకైనా రాని కాఠిన్యం 

అధికారుల వార్నింగ్‌తో అంతిమ సంస్కారాలకు హాజరు  

చివరి రోజుల్లో.. చిట్టచివరి క్షణాల్లో.. కొడుకు కంటి చూపు, స్పర్శ కోసం పరితపించిన ఓ తల్లి వ్యథ ఇది. కాటికేగే వేళ కన్నబిడ్డను కళ్లారా చూసుకుంటే చాలనుకున్న ఓ వ్యథార్థ మాతృమూర్తి యథార్థ గాథ ఇది. అంతిమ ఘడియల్లో అన్నీ తెలిసి కొడుకు కావాలనే రాలేదన్న గుండె పగిలే చేదు నిజాన్ని తాళలేక ఆ కన్నీటి వ్యథతోనే కన్ను మూసిన ఓ అమ్మ కథ ఇది. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం వదిలిపోయావనీ, నాటి నుంచి కంటికి కానరాలేదనీ, చిట్టచివరిగా ఒక్కసారి కనిపించి వెళ్లపో నాయనా అంటూ తల్లి అచేతన స్థితిలో వీడియో పంపి మరీ వేడుకున్నా ఆ కొడుకు మనసు కరగలేదు. 

పుత్రరత్నం తాను ఉన్న హైదరాబాద్‌ నుంచి తల్లి ఉన్న కాకినాడకి తీరిక చూసుకొని చేరేసరికి ఆయువు పోసిన అమ్మ ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ అమాయకపు తల్లి రాజేశ్వరి అయితే, కాఠిన్యం నిండిన ఆ కొడుకు పేరు జోష్యబట్ల రాజశేఖర్‌. తనువు చాలించే వేళ బిడ్డను చూస్తే చాలనుకుంది. పున్నామ నరకం నుంచి తప్పించడమే ఎక్కువనుకొని చిట్ట చివరి వేళ కట్టె గుట్టకి నిప్పంటించి నిష్క్రమించాడా కొడుకు. ఈ హృదయ విదారక ఘటన కాకినాడలో చోటు చేసుకుంది.     – కాకినాడ క్రైం

కొడుకు కోసమే యావత్‌ జీవితం 
కాకినాడ దేవాలయం వీధి వినుకొండ వారి వీధికి చెందిన జోష్యబట్ల రాజేశ్వరి(70) తన ఒక్కగానొక్క కుమారుడి కోసం తన యావత్‌ జీవితాన్ని అర్పించింది. ఈమెకి 45 ఏళ్ల కుమారుడు రాజశేఖర్‌ ఉన్నాడు. బిడ్డను కని భర్త వదిలి పోయినా టైలరింగ్‌ చేస్తూ కుమారుడిని చదివించింది. పదవ తరగతి అనంతరం విడిచిపోయిన తండ్రి పిలుపుతో రాజశేఖర్‌ కేరళ వెళ్లాడు. కొన్నేళ్ల తర్వాత తల్లి వద్దకు వచ్చాడు. ఉద్యోగం కోసం వెతుకుతుంటే తల్లి.. తెలిసిన వారి సాయంతో కాకినాడలో ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం వేయించింది. అదే సమయంలో తల్లిని పిలవకుండానే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి  భార్యను  చూపించి, నాటి నుంచి తల్లిని వదిలిపోయాడు. 

వదిలిపోయి 20 ఏళ్లు 
20 ఏళ్ల క్రితం తల్లిని వదిలిపోయిన రాజశేఖర్‌ మళ్లీ తల్లిని ఒక్క రోజైనా చూడలేదు. రాజేశ్వరి కొడుకు వస్తాడని ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో టైలరింగ్‌ చేసుకుంటూ తనని తాను పోషించుకునేది. ఐదేళ్ల క్రితం తన పనులు తాను చేసుకోలేని నిస్సహాయ స్థితికి చేరింది. ఆమె దయనీయ స్థితిని చూసి పొరుగు వారు  అప్పటి కార్పొరేటర్‌ సాలగ్రామ లక్ష్మీప్రసన్న దృష్టికి తీసుకువెళ్లారు. 

కార్పొరేటర్‌ చొరవ తీసుకొని వలసపాకలలో ఉన్న రెడ్‌ క్రాస్‌ వృద్ధాశ్రమంలో రాజేశ్వరిని చేర్చారు. అక్కడికి వెళ్లాక కూడు,గూడులోటు లేకున్నా కొడుకు కోసం పరితపిస్తున్న మనోవేదన మాత్రం ఆమె ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసింది. తోటి వృద్ధులతో కొడుకు ఉండీ ఇలా అనాథలా బతుకుతున్నానని చెప్పుకొని కన్నీటిపర్యంతమయ్యేది. 

కార్పొరేటర్‌ చొరవతో.. 
అనాథాశ్రమంలో రాజేశ్వరి పరిస్థితి దయనీయంగా మారింది. ఆశ్రమ నిబంధనల ప్రకారం స్వయంగా తమ పనులు తాము చేసుకునేవారికే అక్కడ స్థానం ఉంటుంది. నానాటికీ క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితితో రాజేశ్వరి మంచానికి పరిమితం అయింది. ఆశ్రమ యాజమాన్యం రాజేశ్వరిని చేర్చిన కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రసన్నకు విషయం చెప్పడంతో ఆమె రాజేశ్వరిని కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి సేవలు చేశారు. నివాసాన్ని కోరుతూ కలెక్టర్‌ షణ్మోహన్‌కు లక్ష్మీప్రసన్న ఈ ఏడాది మే 12వ తేదీన లేఖ రాశారు. 

తక్షణమే స్పందించిన ఆయన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, రాజేశ్వరి బాగోగులు పరిశీలించి తగిన నివాస సదుపాయం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మిని్రస్టేటర్‌ రంగనాథం శైలజ రాజేశ్వరి బాగోగుల బాధ్యతలు చూసుకున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు, పెద్దాపురంలో బాధ్యత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మన ఇల్లు’ వసతి గృహానికి రాజేశ్వరిని తరలించారు.  

కొడుకా అని కలవరిస్తూ... 
నాటి నుంచి రాజేశ్వరి తన కుమారుడి పేరును కలవరిస్తూనే ఉంది. వసతి గృహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, బృందం ఆమెకి సపర్యలు చేసేది. రాజేశ్వరి చివరి కోరికను తెలుసుకున్న సత్యనారాయణ విషయాన్ని శైలజ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రాజేశ్వరి కుమారుడు రాజశేఖర్‌ను సంప్రదించి తల్లి దీనావస్థను వివరిస్తే రావడానికి తనకు తీరిక లేదని ఫోన్‌లో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. 

సత్యనారాయణ, ఆయన బృందం రాజశేఖర్‌తో మాట్లాడినా ఫలితం లేకపోయింది. తాను సంగీత దర్శ­క­త్వం చేస్తుంటానని, చాలా బిజీగా ఉంటానని తనకు మాటి మాటికీ ఫోన్లు చేయవద్దని విసుక్కున్నాడు. అప్పటికే రాజేశ్వరి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. తిండి మానేసింది, మందులు తీసుకోవడానికి శరీరం కూడా సహకరించడం లేదు. అటువంటి నిస్సత్తువలో కూడా కొడుకు కోసమే పరితపించేది. కొడుకా కొడుకా అంటూ కలవరించేది. 

పోలీసుల వార్నింగ్‌ 
రాజశేఖర్‌ తన తల్లి స్థితిని కళ్లకు కట్టేలా వీడియోలు పంపి వివరించినా ఏ మాత్రం చలించలేదు. పైగా చెబుతున్న వారందరినీ తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాకినాడ టూ టౌన్‌ సీఐ మజ్జి అప్పలనాయుడు సూచనలతో పోలీసులు రాజశేఖర్‌కి కాల్స్‌ చేశారు. వచ్చి తల్లికి కనిపించి వెళ్లకపోతే సీనియర్‌ సిటిజన్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌–2019 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మరో మార్గం లేక రాజశేఖర్‌ హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ఈ నెల 10వ తేదీన ఉదయం వచ్చాడు. అయితే కొడుకు రాకకోసం పరితపించి అతడు రావడానికి కొద్ది గంటల ముందే ప్రాణాలు విడిచింది.  

అంతిమ సంస్కారాలు మీరే చెయ్యండి 
రాజశేఖర్‌ వచ్చి తల్లి మృతదేహాన్ని చూసి మండిపడ్డాడు. ఇంత మాత్రానికే తనను ఎందుకు ఇబ్బంది పెట్టారని విసుక్కున్నాడు. అంతిమ సంస్కారాలు కూడా మీరే చేసేయండని ఎంత కావాలన్నా ఇచ్చేస్తానని బేరాలాడాడు. శైలజ ఆమె బృందం నచ్చజెప్పారు. నిన్ను చూడాలన్న ఆమె ఆఖరి కోరిక ఎలాగో తీర్చలేదు, కనీసం తలకొరివి అయినా పెట్టమని అడిగారు. సఖి వన్‌స్టాప్‌ సెంటర్, బాధ్యత ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఎట్టకేల­కు రాజశేఖర్‌ మాతృమూర్తి మృతదేహానికి తల­కొ­రివి పెట్టాడు. అంతిమ సంస్కారాలు బలవంతంగా చేయించిన అధికారులు, ఫౌండేషన్‌ సభ్యులపై విసుక్కొని  వెళ్లిపోయాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement