సామర్లకోట: అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పించడం వలన మంచి జరుగుతుందని మహిళల నమ్మకం. ఈనెల 13 నుంచి 28 వరకు పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పసుపు కొమ్ములు స్వీకరించే కార్యక్రమాన్ని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆలయ ఆవరణలో కలశం ఏర్పాటు చేసి వాటిలో మహిళలు పసుపు కొమ్ములు సమర్పించే ఏర్పాటు చేశారు. మహిళలు సమర్పించిన పసుపు కొమ్ములను ఆలయంలో నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం పెద్దాపురం పట్టణానికి చెందిన లలితా సంకీర్తన భక్త మండలి సభ్యులు పసుపు కొమ్ములు ఆలయానికి తీసుకొచ్చారు. పసుపు కొమ్ములను కలశంలో సమర్పించి ఆలయ ప్రాంగణంలో పారాయణ నిర్వహించారు. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేశారు.


