వైఎస్సార్ సీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దిన వేడుకలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని, వారిని స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ముందుకు సాగుదామని వైఎస్సార్ సీపీ శ్రేణులు అన్నారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. తొలుత రాజా పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో త్యాగధనులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి తోట నరసింహం, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ వంగా గీత, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్, నగర అధ్యక్షురాలు సుంకర ప్రసన్న శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


