అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం! | software engineer ends life in road accident at nellore district | Sakshi
Sakshi News home page

అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం!

Mar 19 2025 11:49 AM | Updated on Mar 19 2025 11:49 AM

software engineer ends life in road accident at nellore district

 రోడ్డు ప్రమాదంలో  మృతి

వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్‌ (25) వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు.

 బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్‌ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్‌ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్‌ టేక్‌ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. 

రోడ్డుపై పడిపోయిన దినేష్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్‌ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్‌ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement