
ఏడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పది హత్యల కేసులలోని నిందితులకు జీవిత కారాగార శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో ఏడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బందెల అబ్రహాం దోషులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. సేకరించిన వివరాల మేరకు.. 2019లో ఏలూరులో కాటి నాగరాజు అనే వ్యక్తి అనుమానాస్పద మృతిపై కేసు నమోదైంది.
దీనిపై అప్పటి ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ సీఐ అనుసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది.ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారించగా.. నాగరాజుది అనుమానాస్పద మృతి కాదని సైనేడ్ ఉపయోగించి హత్య చేసినట్లుగా తేలింది. నిందితులు కూడా మరో తొమ్మిది మందిని హత్యచేసినట్లు దర్యాప్తులో తేలడంతో.. ముద్దాయిలైన ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి, విజయవాడకు చెందిన షేక్ అమీనుల్లా బాబులను అరెస్టు చేశారు.
ప్రసాదంలో సైనేడ్ కలిపి హత్య..
విజయవాడలోని అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన గండికోట భాస్కర్రావును కూడా నిందితులు సైనేడ్ ఉపయోగించి హత్య చేశారు. అతడి భార్య గండికోట పద్మావతి ఫిర్యాదు మేరకు అజిత్సింగ్ నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మృతుడు రియల్ఎస్టేట్ వ్యాపారి కావడంతో నిందితులతో ఎక్కువ లావాదేవీలున్నాయని, ఈ క్రమంలో వారి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో భాస్కర్రావును నిందితులు ప్రసాదంలో సైనేడ్ కలిపి హత్య చేసినట్లు విచారణలో తేలింది.
ఆరుగురిని నరికి చంపిన కేసులో దోషికి మరణశిక్ష
విశాఖ నాలుగో అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు
2021లో ఒకే కుటుంబంలోని వారిని హత్య చేసిన అప్పలరాజు
6 నెలలు, 2 ఏళ్ల పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య
విశాఖ లీగల్/పెందుర్తి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడలో ఆరుగురి హత్య కేసులో నిందితుడు బత్తిని అప్పలరాజు (47)కు కోర్టు మరణ శిక్ష విధించింది. విశాఖ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చారు. 2021లో జరిగిన ఈ హత్యల నేపథ్యం ఇది... జుత్తాడలో బత్తిని అప్పలరాజు, బమ్మిడి రమణ (63) కుటుంబాలు పక్కపక్కనే నివసించేవి. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండంతో రమణ కుమారుడు విజయకిరణ్ అప్పలరాజు అతన్ని పలుసార్లు హెచ్చరించాడు. పోలీసు కేసు కూడా పెట్టారు.
అయినా, ఫలితం లేకపోవడంతో కోపం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు విజయ్.. అత్తగారి ఊరు విజయవాడలో స్థిరపడ్డాడు. కాగా, 2021 ఏప్రిల్ 15న విశాఖ శివాజీపాలెంలోని వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడ నుంచి విజయ్ తండ్రి రమణ, భార్య ఉషారాణి (35), పిల్లలు ఉదయనందన్ (2), లిఖిత్ (6 నెలలు), అత్త అల్లు రమాదేవి (55), మేనత్త నెక్కల అరుణ (57) వి.జుత్తాడ వచ్చారు. విజయ్ కుటుంబంపై పగతో రగిలిపోతున్న అప్పలరాజు... ఏప్రిల్ 15 తెల్లవారుజామున వాకిలి కడిగేందుకు బయటికి వచ్చిన అల్లు రమాదేవిపై ఒక్క ఉదుటున ఈత కల్లు తీసే కత్తితో దాడి చేశాడు. మెడపై వేటు పడటంతో ఆమె కుప్పకూలింది.
తర్వాత ఇంటి లోపలికి వెళ్లి నిద్రలో ఉన్న ఉషారాణి, ఆమె పిల్లలను కూడా కిరాతకంగా హత్య చేశాడు. ఉషారాణి పొట్టపై విచక్షణారహితంగా పొడిచి పేగులు బయటకు తీశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన అరుణ... బాత్రూమ్లో ఉన్న రమణ వద్దకు పరుగులు తీసింది. అప్పలరాజు ఆమె వెంటపడి మెడపై నరికి, డోర్ తీసిన రమణపైనా కత్తితో దాడికి పాల్పడి చంపేశాడు. ఈ బీభత్సంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది. అప్పలరాజు అదే రోజు రాత్రి పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు.
ఈ నేపథ్యంలో అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు న్యాయసేవా« ప్రాధికార సంస్థ ద్వారా అవకాశం కల్పించారు. కాగా, అప్పలరాజు కక్ష పెంచుకున్న విజయ్ వి.జుత్తాడకు రాలేదు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అతడు పెద్ద కుమారుడు అఖిల్తో విజయవాడలోనే ఉండిపోయాడు. విజయ్ కూడా వచ్చి ఉంటాడని, చంపేయాలనే ఉద్దేశంతోనే అప్పలరాజు దాడికి పాల్పడ్డాడు.