సాక్షి, విజయవాడ: తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విజయవాడ లాకప్డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటీకీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బూడిదైనా ఇప్పించాలని.. లేకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానన్నారు. తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని.. లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న సాయికృష్ణ తల్లి.. విచారణ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సాయికృష్ణ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నన్ను చంపాలనే కుట్ర జరుగుతుంది. మేము కాపులంతా ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు. నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా?. కేసు వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. అందుకే ఇలా చంపారు. నా కొడుకుని తీసుకెళ్లిన వాళ్లను ఇంకా అరెస్ట్ చేయలేదు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మెజిస్టీరియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. రెండు గంటల పాటు ఆమె నుంచి సమాచారం తీసుకున్నారు. కేసు విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు.



