సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా పని చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి. మనకు అత్యంత ప్రజాదరణ ఉంది. అందుకే తప్పకుండా గెలుస్తాం’’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.
‘‘రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన పోలీసులు. ఆ స్థాయికి దిగజారిన వ్యవస్థలు. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రలు చేస్తున్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. అంత దారుణంగా పోలీసులు, అధికార పార్టీ వారు కుమ్మక్కై పని చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో మన వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది.
..అందుకే నాటి గత మన ఐదేళ్ల పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మరో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయండి’’ అంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.


