సాయికృష్ణ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | Sai Krishna Lockup Death Case, Big Twist In SIT Inquiry, Crucial CCTV Footage Missing, Check Out Full Details Inside | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Jun 23 2026 9:21 AM | Updated on Jun 23 2026 10:38 AM

Sai Krishna Case: Big Twist in SIT Inquiry CCTV Footage Full Details Here

సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌​ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ వ్యవహారంలో సస్పెండైన సీఐ నాగరాజు పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ రికార్డులను పరిశీలించిన సిట్ అధికారులు, మే 1 నుంచి జూన్ 1 వరకు ఉండాల్సిన ఫుటేజ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడాన్నిగుర్తించినట్లు సమాచారం. నెల రోజుల వ్యవధిలో.. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉంచబడినట్లు తేలింది. మిగతా రికార్డులు ఉద్దేశపూర్వకంగానే తొలగించబడ్డాయా? గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ప్లాన్ చేశారా? నాగరాజే వీటి వెనుక ఉన్నాడా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ దృశ్యాలను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలకు ముందే మే నెలకు సంబంధించిన ఫుటేజ్ తొలగించబడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఇది సాధారణ సాంకేతిక లోపమా లేదంటే కీలక ఆధారాలను చెరిపివేసే ప్రయత్నమా? అనే దానిపై విచారణ ముమ్మరమైంది.

సాయికృష్ణ కేసు దర్యాప్తుకు ఈ సీసీటీవీ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలపై స్పష్టత ఇవ్వగల ఆధారాలు ఇవేనని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ఫుటేజ్ లేకపోవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఐ నాగరాజే ఉద్దేశపూర్వకంగా వాటిని మాయం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే.. సాయికృష్ణ కేసులో కీలక ఆధారాలు అందుబాటులో లేకుండా పోవడంతో అప్పటి పోలీసు అధికారుల పాత్ర, కేసు నిర్వహణ తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీ ఫుటేజ్ మాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిట్, బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement